- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
- సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం
ఖమ్మం జిల్లాకు చెందిన రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ మేరకు అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. రైతు ప్రభాకర్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిఎం సూచించారు. ఇప్పటికే ప్రభాకర్ మృతిపై పలువురు మంత్రులు స్పందించి విచారణ వేగవంతం చేయాలని ఆదేశించడంతో పాటు తాజాగా, సిఎం రేవంత్ రెడ్డి సైతం ఆదేశాలు జారీ చేయడంతో పోలీసులు సైతం కేసును సీరియస్గా తీసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు.
కాగా, ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దటూరుకు చెందిన ప్రభాకర్ అనే రైతు తన భూమిని కొందరు కబ్జా చేశారని పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదనతో సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం ప్రభాకర్ ఆత్మహత్యపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించింది.