- ఒకటి ఇరు రాష్ట్రాల మంత్రులు, మరొకటి ఉన్నతస్థాయి అధికారులతో…
- నిర్ణీత వ్యవధిలోనే సమస్యలను పరిష్కరించుకుందాం…
- రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా
- సమస్యలను పరిష్కరించుకోవాలి
- అధికారుల సలహాలు, సూచనలను పరిగణలోకి తీసుకున్న ఇరు రాష్ట్రాల సిఎంలు
- సుమారు రెండుగంటల పాటు జరిగిన సిఎంల సమావేశం
- పలు అంశాలపై లోతుగా చర్చ
సమస్యల పరిష్కారానికి రెండు రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, ఉన్నతస్థాయి అధికారులతో మరో కమిటీని వేయాలని ఇరు రాష్ట్రాల సిఎంలు నిర్ణయించారు. ఈ మంత్రుల కమిటీలో తెలంగాణ నుంచి పొన్నం, శ్రీధర్ బాబులు ఉండే అవకాశం ఉంది. శనివారం సాయంత్రం ప్రజాభవన్లో జరిగిన ఇరు రాష్ట్రాల సిఎంల భేటీలో ఇరు రాష్ట్రాల నుంచి సిఎంలతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ప్రజాభవన్లో కొనసాగిన ఈ భేటీలో విభజన అంశాలపై లోతుగా చర్చ జరిగింది. రెండు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వకంగా చర్చ కొనసాగగా, ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి మొదటి అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి చీఫ్ చంద్రబాబు హైదరాబాద్లోని ప్రజా భవన్లో అడుగుపెట్టగానే ఆయనకు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, ఇతర అధికారులు స్వాగతం పలికారు.
షెడ్యూల్ 10లోని పలు అంశాలపై ప్రధానంగా చర్చ
పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారంపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఆరు గంటల పది నిమిషాలకు ప్రజాభవన్లో ప్రారంభమయ్యింది. విభజన చట్టంలో పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న అంశాలపై వారిద్దరూ సుమారు రెండుగంటల పాటు చర్చించారు. వీటిలో పెండింగ్ సమస్యల పరిష్కారంపై అధికారుల సూచనలను సిఎంలు తీసుకున్నారు. ఈ భేటీలో భాగంగా 10 కీలక అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు ఉండాలని ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల సిఎంలు నిర్ణయించారు. ఈ క్రమంలోనే న్యాయపరమైన చిక్కులకు సంబంధించి అధికారులతో సిఎంలు చర్చించారు. షెడ్యూల్ 10లోని పలు అంశాలపై ప్రధానంగా చర్చ జరగ్గా, నిర్ణీత వ్యవధిలోనే సమస్యలను పరిష్కరించుకోవాలన్న ఏకాభిప్రాయానికి ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు.
ఐదు గ్రామాల వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు లేఖ
విభజన చట్టంలో ఉన్న ఆస్తులు, అప్పులపై ముఖ్యమంత్రులు చర్చించారు. హైదరాబాద్లోని కొన్ని భవనాలు ఎపికి ఇవ్వాలని చంద్రబాబు కోరినట్లుగా తెలుస్తోంది. అయితే హైదరాబాద్లో ఉన్న స్థిరాస్తులు మొత్తం తెలంగాణకు చెందుతాయని స్థిరాస్తులు ఎపికి ఇవ్వడానికి సిఎం రేవంత్ నిరాకరించినట్టుగా తెలిసింది. విద్యుత్ బకాయిలపై ఎపి ప్రస్తావించగా బకాయిలు చెల్లించేది లేదని తెలంగాణ అధికారులు వెల్లడించి నట్టుగా సమాచారం. ఇక ఎపి ప్రభుత్వమే విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని తెలంగాణ అధికారులు పేర్కొన్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే విద్యుత్ బకాయి లెక్కలను అధికారులు ఇరు రాష్ట్రాల సిఎంల ముందుంచినట్టుగా తెలిసింది. ఐదు గ్రామాల వ్యవహారంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల సిఎంల భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చిన ప్రధానంశాలు ఇలా…
1) విభజన చట్టంలో పేర్కొన్న, పేర్కొనని సంస్థల ఆస్తుల పంపకాలు
2) ఎపి ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు
3) పెండింగ్ విద్యుత్ బిల్లులు
4)విదేశీ రుణ సాయంతో ఉమ్మడి రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిర్మించారు. వాటి అప్పుల పంపకాలు
5)ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చుకు చెల్లింపులు
6)హైదరాబాద్లో ఉన్న మూడు భవనాలు ఎపికి కేటాయించే అంశం
7)లేబర్ సెస్ పంపకాలు
8)ఉద్యోగుల విభజన అంశాలు.
చంద్రబాబుకు బహుమతిగా ‘నా గొడవ’ పుస్తకం
ప్రజా భవన్కు వచ్చిన టిడిపి చీఫ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సిఎం రేవంత్ రెడ్డి శాలువాతో సత్కరించి పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చారు. తెలంగాణ ప్రముఖ కవి కాళోజి రాసిన “నా గొడవ” పుస్తకాన్ని సిఎం రేవంత్ చంద్రబాబుకు బహుకరించారు. కాగా, నిజాం కాలం నుంచి 1980 వరకు జరిగిన పాలనతో పాటు నిజాం, బ్రిటిషర్ల పాలన మధ్య తేడాలపై కాళోజీ ‘నా గొడవ’ పుస్తకంలో వివరించారు. దీంతో పాటుగా ఏళ్ల తరబడి జరిగిన తెలంగాణ ప్రజా ఉద్యమాల గురించి ‘నా గొడవ పుస్తకం’లో అనేక అంశాలను కాళోజీ ప్రస్తావించారు. తెలంగాణ ఉద్యమాలకు సంబంధించిన కాళోజీ ‘నా గొడవ’ పుస్తకాన్ని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఇక చంద్రబాబు తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రతిమను తెలంగాణ సిఎం రేవంత్కు అందచేశారు.
ఇరు రాష్ట్రాల డిమాండ్లు ఇలా…..
ముఖ్యంగా ఇరు రాష్ట్రాలు పలు డిమాండ్లతో ఈ సమావేశానికి హాజరయ్యాయి. అందులో తెలంగాణ ప్రధాన డిమాండ్లు పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఎపిలో కలిసిన ఏడు తెలంగాణ మండలాలను తిరిగి ఇవ్వాలి. విద్యుత్ సంస్థ బకాయిలు 24 వేల కోట్ల రూపాయలు చెల్లించాలి. కృష్ణా జలాల్లో 558 టిఎంసిలు కేటాయించాలి. టిటిడిలో తెలంగాణకు వాటా ఇవ్వాలి. ఎపి ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐడి ఆఫీస్ లాంటి భవనాలు అప్పగించాలని ఎపి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. ఇక ఎపి ప్రభుత్వం ప్రధాన డిమాండ్లలో భాగంగా తెలంగాణ రూ.7 వేల కోట్ల విద్యుత్ బకాయిలు చెల్లించాలి. కృష్ణాజలాల్లో 512 టిఎంసిలు కేటాయించాలి. ఉద్యోగుల విభజన అంశాలు, ఎజెండాలోని అంశాలతో పాటు షెడ్యూల్ 9, 10 లోని సంస్థలు, నిధులు, ఆస్తులపై నిర్ణయం తీసుకోవాలి. ఎపి నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు, ఆస్తులు, బిల్డింగ్ల పంపిణీకి సంబంధించిన అంశాలతో పాటు పదో షెడ్యూల్లో ఉన్న 142 సంస్థల పంపిణీ, రాజ్ భవన్, హైకోర్టు, లోకాయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణ బకాయిలపై వివాదాలను పరిష్కరించుకోవాలి. ఇక కృష్ణా జలాల్లో వాటాలు, సంగమేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం, ఎపి ఆధీనంలో ఉన్న లేక్ వ్యూ గెస్ట్ హౌస్, సిఐడి ఆఫీస్ భవనాల గురించి చర్చించాలని ఈ సమావేశానికి ఎపి ప్రభుత్వం హాజరయ్యింది.
ఇరు రాష్ట్రాల నుంచి హాజరైన వారిలో…
హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, ఎపి సిఎం చంద్రబాబులు భేటీ అయ్యారు. ఎపి ప్రభుత్వం తరపున మంత్రులు కందుల దుర్గేశ్, అనగాని సత్యప్రసాద్, బిసి జనార్దన్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ నీరబ్కుమార్, మరో ఇద్దరు ఐఏఎస్లు ఎం.జానకి, కార్తికేయ మిశ్రాలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి డిప్యూటీ సిఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సిఎస్ శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఐఏఎస్లు రామకృష్ణ, వి.శేషాద్రి, కె.శ్రీనివాస రాజు, రఘునందన్ రావులు పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం తెలంగాణ సిఎం రేవంత్రెడ్డి వారికి డిన్నర్ ఏర్పాటు చేశారు.