ఎస్ఎల్బీసీ సొరంగంలో రోబోలు దిగాయి. ఎన్వీ. రోబో టిక్స్ టీమ్ బుధవారం సాయంత్రం టన్నెల్ వద్దకు చేరోకోగా.. అక్కడి పరిస్థితులను పరిశీలించి గురువారం నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేశాయి. ఢిల్లీ నుంచి సిస్మాలజీ టీమ్, వాటర్ జెట్లు కూడా రంగంలోకి దిగాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల కోసం 13 రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. టన్నల్లో శిథిలాలు కార్మికులు తొలగిస్తే ఎక్కువ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉందని ఇంజనీర్ నిపుణులు తెలిపారు. ప్రమాదం జరిగిన చోటు కంటే 400 మీటర్ల ముందు కూడా సిమెంట్ సెగ్మెట్ లైనింగ్ చెదిరిపోయిందని నిపుణులు అంచనా వేశారు. దీంతో ఏ క్షణమైన ప్రమాదం జరిగే అవకాశం పొంచి ఉందని.. టన్నల్లో శిథిలాలను తొలగించేందుకు రోబోలను వాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇంజనీర్లు సూచించారు. ఈ మేరకు రోబోలతో సహాయక చర్యలు మొదలయ్యాయి. అలాగే టన్నెల్లో ఉన్న టీబీఎం ముందు భాగంలో పేరుకుపోయిన మట్టి, బురదను తొలగించేందుకు వాటర్ జెట్లను వాడాలని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అనుకుంది. ముందుగా బయట ట్రయల్ చేసి పనితీరుని వివరించిన అనంతరం టన్నెల్లోకి తీసుకెళ్లారు. దీంతో వాటర్ జెట్ను ఉపయోగించి బురద, మట్టిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లోకి రోబోలను పంపించే ప్రయత్నం మొదలైంది. హైదరాబాద్కు చెందిన ఎన్వీ.రోబోటిక్స్ ప్రతినిధుల టీమ్ టన్నెల్ వద్దకు చేరుకుంది. ఉదయం టన్నెల్లోకి వెళ్లిన టీమ్ సభ్యులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు. మనుషులు వెళ్ల లేని ప్రాంతానికి రోబోలను పంపించి, వాటి ద్వారా మట్టిని తవ్వించే ప్రయత్నాలపై అధ్యయనం చేశారు. తాము పరిశీలించిన అంశాలు, రోబోలను పంపే సాధ్యాసాధ్యాలపై రిపోర్ట్ను రెడీ చేసి ప్రభుత్వానికి అందించనున్నారు. ఈ రిపోర్ట్ ఆధారంగా ప్రభుత్వం టన్నెల్లోకి రోబోలను పంపించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఢిల్లీకి చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ టీమ్ సభ్యులు సైతం బుధవారం ఎస్ఎల్బీసీ వద్దకు చేరుకున్నారు. టన్నెల్ లోపల టీబీఎం ద్వారా తవ్వకాలు జరిపిన 13.600 కిలోమీటరు నుంచి 13.900 కిలోమీటర్ వరకు ఉన్న మట్టి నమూనాలను సేకరించారు. అలాగే టన్నెల్ లోపల, భూ ఉపరితలంపై ఎన్జీఆర్ఐ అన్వేషణ కొనసాగుతోంది. లక్నో, హైదరాబాద్ కేంద్రాలకు చెందిన జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్లు ప్రసాద్ తప్లియాల్, శైలేంద్రకుమార్ ఆధ్వర్యంలోని టీమ్లు టన్నెల్ పరిసరాలను పరిశీలించాయి.