నిమిషానికి 5 వేల లీటర్ల నీటి ఊట
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ(ఎస్ఎల్బీసీ) టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ ఇప్పటికీ దొరకలేదు. వీరి గురించి ఒతవైపు సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి, బీఆర్వో, ఎన్జీఆర్ఐ, జీఎస్ఐ, ఎల్అండ్టీ తదితర ప్రఖ్యాత సంస్థల బృందాలు సహాయ చర్యలు చేపడుతున్నా వారి దగ్గరికి చేరుకోవడానికి అడుగడుగున అడ్డంకులు వస్తున్నాయి. సొరంగం పనులు చేస్తున్న జేపీ గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు జైప్రకాశ్గౌర్ ప్రత్యేక హెలికాప్టర్లో ఉత్తర్ప్రదేశ్ నుంచి దోమల పెంటకు చేరుకున్నారు. అయితే, టన్నెల్లో ప్రతి నిమిషానికి ఐదు వేల లీటర్ల నీళ్లు ఊరుతుండటం, ఇప్పటికే భారీగా బురద, రాళ్లు మేటవేసి ఉండటంతో సహాయ చర్యలకు తీవ్ర ఆటంకంగా మారిందని అధికారులు చెబుతున్నారు. కార్మికుల క్షేమంపై రోజురోజుకూ ఆందోళన పెరుగుతున్నా ప్రభుత్వం వారిని ఎలాగైనా రక్షించాలని శతవిధాలా ప్రయత్నిస్తుంది.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ హోల్ మైనర్ బృందాలు టన్నెల్లోని బురదలో కూరుకుపోయిన టీబీఎం పరిసరాల వరకు చేరుకున్నారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు గ్యాస్ కటింగ్, లోకోట్రైన్ ట్రాక్కు మరమ్మతు చేశారు. వెంటిలేషన్ ట్యూబ్ను కూడా సరిచేసేందుకు ప్రయత్నాలు చేశారు. అనూహ్యంగా ఊరుతున్న నీటిని భారీ మోటార్లతో తోడేస్తున్నారు. టన్నెల్ లోపల, బయటి ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సీసీ కెమెరాలను బిగించారు. దీనివల్ల సహాయ చర్యలను ప్రత్యక్షంగా చూసేందుకు, పరిస్థితులను అంచనా వేసే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో సేవలు అందిస్తున్న బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) సీనియర్ అధికారి కర్నల్ పరిక్షిత్ మెహ్రాతోపాటు మాజీ డీజీ హర్పాల్సింగ్, మాజీ అడిషనల్ డీజీ పురుషోత్తం సైతం సొరంగాన్ని పరిశీలించారు. సరిహద్దుల్లో, కొండ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవమున్న వీరి సలహాలను తీసుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి దోమలపెంటకు రప్పించారు. వారు ప్రమాదం జరిగిన ప్రదేశం, అక్కడి మట్టి స్వభావాన్ని పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు.