- ప్రకటించిన యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్
- ప్రభుత్వ హామీతో సరఫరాకు నిర్ణయం
తెలంగాణలో అతిపెద్ద బీర్ల తయారీ సంస్థ యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ (యూబీఎల్) సంస్థ బీర్ల సరఫరాను పునరుద్ధరించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ హామీతో బీర్ల సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది. ధరల పెంపు, బకాయిలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. గత రెండేళ్ల నుంచి రూ.702 కోట్ల బకాయిల్ని కార్పొరేషన్ విడుదల చేయకపోవడం, బీరు మూల ధరను సవరించాలని ఎన్నిసార్లు విన్నవించినా ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో బీర్ల సరఫరాను యూబీఎల్ నిలిపివేసిన సంగతి తెలిసిందే..
రాష్ట్రంలో ఆరు బీర్ల తయారీ సంస్థలున్నా మార్కెట్లోకి వొచ్చే వాటిలో 75 శాతం వాటా యూబీఎల్దే. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడింది. దీంతో మద్యం ధరల పెంపు అంశంపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ సిఫారసుల మేరకు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇవ్వడంతో యూబీఎల్.. సరఫరాను పునరుద్ధరించింది.