- ఆర్ఎస్ఎస్ భావజాల జొప్పించే ప్రయత్నం
- డిఎంకె ఆందోళనలో రాహుల్ విమర్శలు
యూజీసీ ముసాయిదా విద్యాపరమైన చర్య మాత్రమే కాదని, ఇది మన చరిత్ర, సంప్రదాయం, సంస్కృతి, భాషలపై దాడి చేసేందుకు ఆరెస్సెస్ చేస్తున్న ప్రయత్నం అని కాంగ్రెస్ ఎంపి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ఇదే విషయాన్ని తాను కొంతకాలంగా చెబుతున్నానని అన్నారు. ఈ దేశంలో ఒకే చరిత్ర, ఒకే సంప్రదాయం, ఒకే భాష విధించాలనే ఆలోచనతోనే వారు రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని అన్నారు.
వివిధ రాష్టాల్ర విద్యా వ్యవస్థపై వారు చేస్తున్న ఈ ప్రయత్నం తమ ఎంజెడాను ముందుకుతీసుకెళ్లేందుకే అని రాహుల్ విమర్శించారు. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రవేశపెట్టిన నూతన ముసాయిదా నిబంధనలు భాజపాయేతర రాష్టాల్రు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ముసాయిదాకు వ్యతిరేకంగా డీఎంకే విద్యార్థి విభాగం గురువారం దిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసనలకు దిగింది. అనంతరం యూజీసీ ప్రవేశపెట్టిన ముసాయిదాను తాము వ్యతిరేకిస్తున్నట్లు అఖిలేశ్ యాదవ్ తెలిపారు.
ఈ నూతన విధానం యూనివర్శిటీలను పారిశ్రామికవేత్తలకు అప్పగించే కుట్రగా ఆయన పేర్కొన్నారు. ఈ విధానానికి తాము ఎప్పటికీ మద్దతు ఇవ్వబోమన్నారు. వర్శిటీలు, కళాశాలల్లో అధ్యాపకులు, బోధనా సిబ్బంది నియామకం, పదోన్నతి కనీస అర్హతలు, ఉన్నత విద్యలో ప్రమాణాల నిర్వహణకు మార్గదర్శకాలు-2025 పేరిట యూజీసీ ఇటీవల ఓ ముసాయిదాను విడుదల చేసింది. అందులోని పలు అంశాలు బాగా వివాదాస్పదమవుతున్నాయి.
ఇప్పటివరకు విశ్వవిద్యాలయాల అధిపతులైన ఉపకులపతుల నియామకం రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధిలో ఉంది. నూతన ముసాయిదా ప్రకారం ఆ అధికారం ఛాన్సలర్లుగా ఉన్న గవర్నర్ల చేతుల్లోకి వెళ్తుంది. ఈ మార్పును భాజపాయేతర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా నిరసిస్తున్నాయి. తమిళనాడు, కేరళ వంటివి ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ చట్టసభల్లో తీర్మానం కూడా చేశాయన్నారు. ఈ నిరసనలో డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధితో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొన్నారు.