Friday, September 20, 2024

వన్​ నేషన్​.. వన్​ ఎలక్షన్​

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. వన్ నేషన్- వన్ ఎలక్షన్‌కు కేంద్ర మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రామ్ నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. శీతాకాలం పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ నివేదికలో ఇచ్చిన సూచనల మేరకు తొలి దశగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగిన 100 రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలను కూడా నిర్వహించాలని కమిటీ సిఫార్సు చేసింది. దీంతో దేశం మొత్తం నిర్ణీత వ్యవధిలో అన్ని స్థాయిల్లో ఎన్నికలు నిర్వహించవచ్చు. ప్రస్తుతం నాలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలో ఒకేసారి లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. మిగతా రాష్ట్రాల్లో ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగడం లేదు.

కేంద్ర కేబినెట్​ ఆమోదం
దేశంలో జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సంబంధించి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ రూపొందించిన నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. దేశంలో ఒకేసారి ఎన్నికల నిర్వహణ ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాల పరిశీలనకు ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలోని కమిటీ సమర్పించిన నివేదికను కేబినెట్‌ ఆమోదించింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన బుధవారం సమావేశమైన మంత్రివర్గం, రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించింది. అనంతరం ఆమోదం తెలిపినట్లు కేంద్రమంత్రి అశ్వినీ వైష్టవ్‌ వెల్లడించారు.
దేశంలోని పెద్ద సంఖ్యలో రాజకీయ పార్టీలు జమిలి ఎన్నికల ప్రతిపాదనకు మద్దతు ఇచ్చాయని మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఉన్నత స్థాయి సమావేశాల్లో ఆయా పార్టీల నేతలు మరోసారి తమ అభిప్రాయాలు చెబుతారని అన్నారు. జమిలి ఎన్నికలను దేశాన్ని బలోపేతం చేసే అంశంగా వర్ణించారు. మరోవైపు, జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును వచ్చే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జమిలి ఎన్నికలు ఆచరణాత్మకం కాదు: ఖర్గే
జమిలి ఎన్నికలు ఆచరణాత్మకం కాదని, ఇది ప్రజలు దృష్టి మరల్చేందుకు చేసే బీజేపీ ప్రయత్నమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు వాస్తవ సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికి బీజీపీ ఇలాంటి వాటిని తెరపైకి తెస్తోందని ఆరోపించారు. తమ పార్టీ జమిలి ఎన్నికలకు మద్దతు ఇవ్వడం లేదని తెలిపారు. ప్రజాస్వామ్యంలో జమిలి ఎన్నికలు సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యం మనుగడ సాగించాలంటే అవసరమైనప్పుడు ఎన్నికలు నిర్వహించాలని ఖర్గే వ్యాఖ్యానించారు.

ప్రతిపక్షాల్లో అంతర్గత ఒత్తిడి
అయితే ఖర్గే వ్యాఖ్యలపై కూడా మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. జమిలి ఎన్నికల విషయంలో ప్రతిపక్షాలు అంతర్గత ఒత్తిడి ఎదుర్కొంటున్నాయని ఆరోపించారు. 80 శాతానికిపైగా ప్రజలు జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపారని తెలిపారు. ముఖ్యంగా యువత ఆసక్తి కనబరిచారని చెప్పారు. ప్రస్తుత ఎన్​డీఏ సర్కారు హయాంలోనే జమిలి ఎన్నికలు అమలుచేసి చూపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఇటీవల స్పష్టం చేశారు. గత నెల స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ ఎర్రకోట నుంచి ప్రసంగిస్తూ జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. దేశవ్యాప్తంగా ఏటా ఏదోఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. వీటి ప్రభావం దేశ పురోగతిపై పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనినుంచి బయటపడాలంటే జమిలి ఎన్నికలే పరిష్కారమని అన్నారు. ఈ దిశగా అన్ని రాష్ట్రాలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్​డీఏ 3.0 సర్కారులోనే జమిలి ఎన్నికలు అమల్లోకి వస్తాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన కీలక హామీల్లో జమిలి ఎన్నికలు ఒకటి.

32 పార్టీలు ఒకే
ఈ ప్రతిపాదనపై పని చేసేందుకు మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ మార్చిలో తన నివేదికను కేంద్రానికి సమర్పించింది. ఈ కమిటీ 62 రాజకీయ పార్టీలను సంప్రదించింది. వీరిలో 32 మంది ఒక దేశం, ఒక ఎన్నికలకు మద్దతు ఇచ్చారు. కాగా, 15 పార్టీలు వ్యతిరేకించాయి. మరో 15 పార్టీలు స్పందించలేదు. అందులో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో బీజేపీతో పాటు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ, నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ, చిరాగ్ పాశ్వాన్‌కు చెందిన ఎల్జేపీ (ఆర్) పెద్ద పార్టీలు. జేడీయూ, ఎల్జేపీ (ఆర్‌)లు ఒకే దేశం, ఒకే ఎన్నికలకు అంగీకరించగా, టీడీపీ మాత్రం దీనిపై ఎలాంటి సమాధానం చెప్పలేదు. జేడీయూ, ఎల్జేపీ (ఆర్​) ఒక దేశం, ఒక ఎన్నికలకు మద్దతు ఇచ్చాయి, ఇది సమయం మరియు డబ్బు ఆదా చేస్తుందని పేర్కొన్నాయి. కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ, సీపీఎం, బీఎస్పీ సహా 15 పార్టీలు దీనిని వ్యతిరేకించాయి. అయితే జార్ఖండ్ ముక్తి మోర్చా, టీడీపీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సహా 15 పార్టీలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు.

భారీ ఖర్చు.. అభివృద్ధికి ఆటంకం
ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అది పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. అయితే, ఎన్నికల నిర్వహణకు భారీ మొత్తం లో ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. దీని వల్ల ప్రజాధనం వృధాగా ఖర్చు అవుతోందని ప్రధాని మోదీ, అమిత్ షాతో సహా బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఒకసారి లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఖర్చు తగ్గించవచ్చని కేంద్రం భావిస్తోంది. ఈ క్రమంలో వన్ నేషన్, వన్ ఎలక్షన్ నినాదాన్ని తెర మీదకు తెచ్చింది. ఇది అమల్లోకి వస్తే భారీగా ఖర్చు తగ్గుతుందని.. అలాగే అభివృద్ధికి ఆటంకం కలగదని బీజేపీ నేతలు పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ లో ప్రవేశ పెట్టబోయే ఈ బిల్లు ఆమోదం పొందుతుందో లేదో వేచి చూడాలి. కాంగ్రెస్ మాత్రం ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది.

కమిటీ సిఫార్సులు
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి.
స్థానిక సంస్థల ఎన్నికలు (మున్సిపాలిటీలు, పంచాయతీలు వంటివి) 100 రోజులలోపు నిర్వహించాలి.
ఈ సిఫార్సుల అమలు ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఉమ్మడి ఓటరు జాబితా, ఒకే ఓటరు గుర్తింపు కార్డు వ్యవస్థ ఉండాలి, దీనిని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల అధికారులతో సంప్రదించి తయారు చేయాలి వంటి ముఖ్యమైన అంశాలను కేంద్రానికి సిఫార్సు చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular