నైనీ కోల్ బ్లాక్ అంశాన్ని త్వరలోనే పరిష్కరిస్తాం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
బొగ్గు గనుల వేలం ప్రక్రియ ప్రారంభం
దేశంలోని అన్ని పరిశ్రమలకు బొగ్గు ప్రాణాధారమని, సింగరేణి బొగ్గు గనుల విషయంలో తెలంగాణ ప్రభుత్వ వినతిని పరిశీలిస్తామని, ఈ విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంతోపాటు సింగరేణి కార్మికులకు ఎలాంటి నష్టం జరగనివ్వమన్నారు. బొగ్గుగనుల వేలం ప్రక్రియను ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాట్లాడుతూ నైని కోల్ బ్లాక్ విషయంలో ఒడిశాతో మాట్లాడి ఉత్పత్తి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
బొగ్గు లేనిదే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని, దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడానికే ఈ బొగ్గుగనుల వేలం ప్రక్రియ జరుగుతుందన్నారు. మార్కెట్లో బొగ్గుకు డిమాండ్ విపరీతంగా ఉందని, హైదరాబాద్లో పరిశ్రమల కోసం ఒకప్పుడు పారిశ్రామికవేత్తలు ఆందోళన చేసేవారని, ఇప్పుడు వ్యవసాయం, కమర్షియల్, గృహ అవసరాలకు..తగినంతగా విద్యుత్ అందుబాటులో ఉందని కిషన్రెడ్డి తెలిపారు.
హైదరాబాద్ వెస్ట్ ఇన్ హోటల్లో పదో విడత కమర్షియల్ కోల్ మైన్ వేలం ప్రక్రియ కొనసాగుతోంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఈ వేలం ను ప్రారంభించారు. ఇందులో కేంద్ర బొగ్గుగనులశాఖ సహాయ మంత్రి సతీష్చంద్ర దూబే, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కేంద్ర బొగ్గు గనుల శాఖ అధికారులు, సింగరేణి సీఎండీ బలరాం, బిడ్డర్లు పాల్గొన్నారు. మొత్తం దేశవ్యాప్తంగా 60 బొగ్గు గనుల బ్లాక్లను కేంద్రం వేలానికి ఉంచింది. ఈ వేలంలో తెలంగాణలోని శ్రావణపల్లి కోల్మైన్ కూడా ఉంది. శ్రావణపల్లి కోల్ మైన్లో 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు గతంలో సింగరేణి గుర్తించింది.
ఈ సందర్భంగా శ్రావణపల్లి బ్లాక్ను నేరుగా సింగరేణికి ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కోరారు. కిషన్రెడ్డి బొగ్గుగనుల శాఖ మంత్రిగా ఎంపిక కావడం సంతోషకరమని, తెలంగాణలోని పరిస్థితులు కేంద్రమంత్రి కిషన్రెడ్డికి బాగా తెలుసన్నారు. గత ప్రభుత్వం తప్పిదాలతో సింగరేణి సంస్థ రెండు సార్లు వేలంలో పాల్గొనలేదని చెప్పారు. శ్రవణపల్లి బ్లాక్ను సింగరేణికి కేటాయించాలని కోరుతూ కేంద్రమంత్రి కిషన్రెడ్డికి ప్రభుత్వం తరఫున కిషన్రెడ్డికి నివేదిక ఇచ్చారు. తెలంగాణలోని 4 బొగ్గుగనుల బ్లాకులను వేలం వేయాలని కేంద్రం నిర్ణయించడం బాధాకరమని, సింగరేణికి కొత్త గనులు కేటాయించాలని కోరారు.