ఉత్తర్ప్రదేశ్లోని సంత్ కబీర్నగర్లో ఓ వింత జరిగింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే టాపిక్ నడుస్తుంది. ఓ భర్త తన భార్యకు ప్రియుడితో పెళ్లి చేశాడు. ఓ భర్త తన భార్యకు మళ్లీ పెళ్లి చేశాడు. తన భార్య వివాహేతర సంబంధాన్ని అంగీకరించడమే కాకుండా, వారి ఇద్దరు పిల్లల బాధ్యతను తానే స్వయంగా తీసుకున్న తీరు చర్చనీయాంశమైంది. యూపీలోని కబీర్ నగర్ జిల్లా కగర్ జూట్ గ్రామానికి చెందిన బబ్లూ, గోరఖ్ పూర్ కు చెందిన రాధికలకు 2017లో వివాహం జరిగింది. వారికి ఇద్దరు పిల్లలు ఆర్యన్(7), శివానీ(2)లు ఉన్నారు.
బబ్లూ తన ఉద్యోగ పనుల కారణంగా తరుచూ తన భార్య, పిల్లలకు దూరంగా ఉండాల్సి వచ్చేది. ఆ సమయంలో బబ్లూ భార్య రాధిక స్థానిక యువకుడైన వికాస్తో వివాహేతర సంబంధంతో దగ్గరైంది. భర్త ,పిల్లలు లేని సమయంలో వికాస్ తో ప్రేమాయణం కొనసాగించింది. ఈ సమాచారం తెలుసుకున్న బబ్లూ అందరిలా ఆవేశ పడకుండా ఆమెను మందలించి ప్రేమతో మార్చాలని ప్రయత్నించాడు. గ్రామ పెద్దలతో చెప్పించినా ప్రయోజనం లేకపోయింది. ప్రియుడి మోజులో ఉన్న రాధిక తన భర్త, పిల్లల కంటే తనకు ప్రియుడే ఎక్కువని మొండికేసింది. దీంతో నీ సుఖమే నేను కోరుకున్నా..అన్నట్లుగా ఓ మూహుర్తానా బబ్లూ తన భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయాలనుకున్నాడు. ముందుగా ధన్ఘాట్ తహశీల్ కోర్టుకు వెళ్లి నా భార్యకు విడాకులిస్తానని..ఆమె ప్రియుడితో పెళ్లి జరిపిస్తానని నివేదించాడు. కోర్టు అంగీకరించి వారికి విడాకులు మంజూరు చేసింది. భార్య రాధికను, ఆమె ప్రియుడిని శివాలయానికి తీసుకెళ్లి దగ్గరుండి వారి పెళ్లి జరిపించాడు. అంతేకాదు..పిల్లల బాధ్యతకు తనే తీసుకుంటానని చెప్పి.. భార్యను, ఆమె ప్రియుడితో సంతోషంగా ఉండమని దీవించి పంపించేశాడు. ఇంతటి త్యాగశీలిని చూసిన స్థానికులు సైతం భర్త నిర్ణయాన్ని కాదనలేక ఆ పెళ్లికి హాజరయ్యారు. సేమ్ కన్యాదానం సినిమాలోలాగా ఇక్కడ కూడా భర్త తన భార్యను ప్రియుడికి ఇచ్చి వివాహం జరిపించాడు.