మెయిన్స్కు 14,627 మంది క్వాలిఫై
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు సోమవారం (జులై 1) విడుదలైన సంగతి తెలిసిందే. వీటితోపాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కు నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు కూడా యూపీఎస్సీ ప్రకటించింది. జూన్ 16న ఈ రెండు పరీక్షలు దేశ వ్యాప్తంగా 80 నగరాల్లో నిర్వహించగా.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 79,043 మంది దరఖాస్తు చేసుకుంటే, వారిలో 42,560 (53.84 శాతం) మంది పరీక్షకు హాజరయ్యారు.
దేశ వ్యాప్తంగా ప్రిలిమ్స్ పరీక్షకు 13.4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. తాజా ఫలితాల్లో దేశవ్యాప్తంగా 14,627 మంది ప్రధాన పరీక్షకు ఎంపికయ్యారు. మెయిన్స్ పరీక్షకు క్వాలిఫై అయిన అభ్యర్థుల రోల్ నంబర్లతో కూడిని జాబితాను కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. తెలుగు రాష్ట్రాల నుంచి 500లకు పైగా అభ్యర్ధులు మెయిన్స్కు ఎంపికైనట్లు సమాచారం. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు, కటాప్ మార్కులు, ఆన్షర్ కీలను మరో రెండు, మూడు రోజుల్లో వెబ్సైట్లో అప్లోడ్ చేయనున్నట్లు ఈ సందర్భంగా కమిషన్ తెలిపింది.
గత ఏడాది మే 26న సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించి జూన్ 12న ఫలితాలు ప్రకటించారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల ఫలితంగా జూన్ 16న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించి, జులై 1న ఫలితాలు వెల్లడించారు. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ 2024 పరీక్షలను రెండు షిఫ్టుల్లో నిర్వహించారు. జనరల్ స్టడీస్ పేపర్-1, పేపర్-2 లకు కలిపి మొత్తం 200 మార్కులకు పరీక్ష జరిగింది. పేపర్ 2లో అర్హత సాధిస్తేనే పేపర్ 1ను మూల్యాంకనం చేస్తారు. ప్రిలిమ్స్లో అర్హత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ రాయవల్సి ఉంటుంది. మెయిన్స్ రాతపరీక్ష తర్వాత పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. షెడ్యూల్ ప్రకారం యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ పరీక్షలు సెప్టెంబర్ 20 నుంచి జరగనున్నాయి.