వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ శాసనసభ్యులు వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం అందించేందుకు అధికారులు ఆయన్ను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి (జీజీహెచ్) తరలించారు. అంతకుముందు ఆయనకు కంకిపాడు ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. వంశీని జీజీహెచ్కు తీసుకువచ్చిన సందర్భంగా పోలీసులు ఆసుపత్రి వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ఆసుపత్రి ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో సాధారణ రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఆసుపత్రికి వచ్చే వారిని రైల్వేస్టేషన్ వైపు ఉన్న ద్వారం గుండా లోపలికి వెళ్లాలని పోలీసులు సూచించారు. దీంతో, ముఖ్యంగా నడవలేని స్థితిలో ఉన్నవారు, వృద్ధులు అంత దూరం తిరిగి రావడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. పోలీసుల హడావుడి, ఆంక్షల వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని పలువురు రోగులు, వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు.