యూట్యూబర్ జ్యోతి హైదరాబాద్లో ఏం చేసింది..?
హైదరాబాద్ నగరంలో మరోసారి ఉగ్రజాడలు కలకలం రేపుతున్నాయి. రెండ్రోజుల కిందట సికింద్రాబాద్ బోయగూడలో సమీర్ అనే యువకుడిని ఏపీ రాష్ట్రానికి చెందిన విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఉలికిపాటుకు గురిచేసింది. పాకిస్థాన్ నిఘా వర్గాలకు మనదేశ రక్షణ సమాచారాన్ని చేరవేసిందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న యూట్యూబర్ జ్యోతిమల్హోత్రా సైతం వందేభారత్ ప్రారంభోత్సవ సమయంలో నగరానికి వచ్చిందని, ఆ సమయంలో ఇక్కడ కొంతమందిని కలిసిందనే ప్రచారం జరుగుతుండటంతో పోలీసులు ఆదిశగా విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. ఇటీవల చోటుచేసుకున్న పహల్గాం దాడి, తాజాగా జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు.
అక్రమ వలసదారులపై కన్ను
నగరంలో అక్రమంగా నివాసం ఉంటున్న 100 మంది బంగ్లాదేశీయులను 4 నెలల వ్యవధిలో పట్టుకున్నారు. డుప్లికేట్ ఆధార్, ఓటరు గుర్తింపు కార్డులతో నగర పౌరులుగా చెలామణి అవుతున్నట్టు గుర్తించిన కొంతమందిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. వారికి సహకరించిన వ్యక్తుల వివరాలను రాబడుతున్నట్టుగా సమాచారం. అక్రమంగా ఉన్న విదేశీయులను గుర్తించి పంపివేయాలంటూ తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చింది. కేంద్ర నిఘా వర్గాలు కూడా ఉగ్ర కార్యకలాపాలపై హెచ్చరికలను జారీచేసిన నేపథ్యంలో హైదరాబాద్ నగర పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఖైరతాబాద్, సనత్నగర్, జవహర్నగర్, అంబర్పేట్ తదితర ప్రాంతాల్లో 15 మంది విదేశీయులను గుర్తించినట్టు సమాచారం.
మారుపేర్లతో చెలామణి
బంగ్లాదేశ్ నుంచి కొందరు అక్రమంగా బంగాల్ మీదుగా నగరానికి చేరినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికీ చాలామందిని అదుపులోకి తీసుకున్నప్పటికీ ఇంకొందరు జనావాసాల మధ్య ఉంటున్నట్టుగా భావిస్తున్నారు. వీరంతా కోల్కతాలో దళారుల నుంచి అక్కడి ఆధార్, ఓటరు ఐడీ కార్డులు పొందారు. నగరం వచ్చాక వాటి వివరాలతో ఆధార్ అడ్రస్ను మార్చుకుంటున్నారు. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో 5200 మంది రోహింగ్యాలు నివాసం ఉంటున్నట్టుగా నిర్ధారించారు.
నలుగురు రోహింగ్యాల అరెస్టు
పెద్ద అంబర్పేటలో తప్పుడు పత్రాలతో(ఫేక్ డాక్యుమెంట్లతో) నివాసముంటున్న నలుగురు రోహింగ్యాలు ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులకు చిక్కారు. రాచకొండ సీపీ సుధీర్బాబు కేసు వివరాలను వెల్లడించారు. మయన్మార్కు చెందిన మహ్మద్ అర్మాన్ అలియాస్ సయ్యద్ ఉల్ అమీన్(32), నయీమ్ అలియాస్ హైరుల్(20) ఇద్దరూ సోదరులు. అదే దేశానికి చెందిన రుమానా అక్తర్ అలియాస్ ముస్తఖీమా(26) ముగ్గురూ 2011వ సంవత్సరంలో అక్రమంగా భారత్లోకి ప్రవేశించారు. తొలుత బాలాపూర్లోని శరణార్థుల క్యాంపులో ఆశ్రయం పొందారు. 2014లో మరో రోహింగ్యా నగరంలో అప్పటికే అక్రమంగా ఉంటున్న మహ్మద్ హరిస్ అలియాస్ మహ్మద్ రిజ్వాన్(33) సాయంతో మహ్మద్ అర్మాన్ తప్పుడు స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్ డిక్లరేషన్) ఇచ్చి మంచాలకు చెందిన ఓ మీసేవా సెంటర్ నిర్వాహకుడి ద్వారా ఆధార్ గుర్తింపు ఐడీని సంపాదించాడు. ముస్తఖీమాకు ఆధార్ కార్డును సంపాదించాడు. ఈ విధంగా వీరంతా క్రమంగా పెద్ద అంబర్పేటకు నివాసం మార్చారు. అర్మాన్, ముస్తఖీమాకు 4 పిల్లలు జన్మించగా వారికి ఆధార్ కార్డులు వచ్చాయి. హరిస్ హఫీజ్బాబానగర్ ఒమర్కాలనీలోని జామియాసరియా మదరసాలో టీచర్గా పనిచేస్తున్నాడు. ఎస్వోటీ ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ మీర్ ముదాసిర్ అలీ బృందానికి అర్మాన్, హైరుల్, ముస్తఖీమా, రిజ్వాన్ నలుగురూ చిక్కారు.