- రెండు నెలల్లో దక్షిణమధ్య రైల్వే పరిధిలో వందే భారత్ స్లీపర్ రైళ్లు అందుబాటులోకి
- భువనేశ్వర్- టు విశాఖపట్నం, తిరుపతి టు -చెన్నైల మధ్య ప్రయాణించే అవకాశం
- రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు పంపిన దక్షిణమధ్య రైల్వే
ప్రస్తుతం వందే భారత్కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నాలుగు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆక్యుపెన్సీ రేటు భారీగా ఉండడంతో మరికొన్ని రైళ్లను ప్రారంభించాలని రైల్వేశాఖ భావిస్తోంది. అయితే, ఈసారి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే అధికారులు నిర్ణయించారు. అయితే దేశంలో తొలిసారిగా రెండునెలల్లో వందే భారత్ స్లీపర్ రైలు పరుగులు తీయబోతుండగా తెలంగాణలో కూడా ఆ రైలు పట్టాలెక్కనుంది. అయితే, ప్రస్తుతం వందే భారత్ స్లీపర్ వెర్షన్ తొలి విడతలో వివిధ మార్గాల్లో నడిపేందుకు రైల్వేశాఖ కసరత్తులు చేస్తోంది. అందులో దక్షిణమధ్య రైల్వే పరిధిలోని భువనేశ్వర్- టు విశాఖపట్నం, తిరుపతి టు -చెన్నైలతో పాటు వివిధ రూట్లను సైతం పరిశీలిస్తోంది.
ఆగష్టు15వ తేదీ నాటికి స్లీపర్ వెర్షన్ ట్రయల్ పూర్తి
ఆగస్టు 15వ తేదీ నాటికి స్లీపర్ వెర్షన్ ట్రయల్ను పూర్తి చేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. అయితే, తొలి విడతలో స్లీపర్ రైలును తెలుగు రాష్ట్రాలకు కేటాయించాలని కేంద్ర రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే నుంచి రైల్వేబోర్డు ప్రతిపాదనలు కోరింది. భారీగా రద్దీ ఉండే సికింద్రాబాద్ టు -పుణే, భువనేశ్వర్- టు విశాఖపట్నం మార్గంలో ఈ స్లీపర్ రైలును కేటాయించాలని అధికారులు కోరినట్లు సమాచారం. ప్రస్తుతం ఈమార్గంలో సూపర్ఫాస్ట్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్ మేరకు స్లీపర్ వెర్షన్ రైళ్లను సైతం కేటాయిస్తే మరింత ఆక్సుపెన్సీ పెరిగే అవకాశం ఉందని దక్షిణమధ్య రైల్వే అధికారులు బోర్డుకు ప్రతిపాదనలు పంపారు.
దేశవ్యాప్తంగా 51 వందే భారత్ రైళ్లు
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నుంచి విశాఖపట్నం టు -సికింద్రాబాద్, విజయవాడ- టు చెన్నై, కాచిగూడ టు -యశ్వంత్పూర్, సికింద్రాబాద్ టు -తిరుపతితో పాటు పలుమార్గాల్లో వందే భారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. ఆయా రైళ్లు వందశాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్నాయి. అయితే సికింద్రాబాద్- టు పుణేల మధ్య వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించాలని దక్షిణ మధ్య రైల్వే భావించింది. తాజాగా ఈ వెర్షన్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కసరత్తులు చేస్తున్నది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 51 వందే భారత్ రైళ్లు వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. సాధారణ రైళ్ల వేగంతో పోలిస్తే అదనపు వేగంగా, అత్యాధునిక సౌకర్యాలు ఉండడంతో ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఇతర రైళ్లతో పోలిస్తే టికెట్ల ధరలు అధికంగానే ఉన్నా త్వరగా గమ్యస్థానాలను చేరుకునేందుకు ప్రయాణికులు వందే భారత్ రైళ్లను వినియోగించుకుంటున్నారు.
2029 నాటికి దేశవ్యాప్తంగా 250 స్లీపర్ రైళ్లు
ప్రస్తుతం ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల కంటే వేగంతో పాటు అదనంగా సౌకర్యాలను ప్రయాణికులను కల్పించబో తుంది. ఈ స్లీపర్ రైలు కోచ్లు చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ ఈ కోచ్ను డిజైన్ చేసింది. అయితే, వందే భారత్ స్లీపర్ రైళ్లను రెండునెలల్లోనే పట్టాలపైకి తీసుకురాబోతున్నట్లు కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ఇటీవల వెల్లడించారు. ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ప్రయాణికులకు మరింత సౌకర్యంగా ఉండేలా స్లీపర్ బెర్తులను తీర్చిదిద్దుతున్నట్లు ఆయన తెలిపారు. దీంతోపాటు ఫ్రంట్ నోస్ కోన్ నుంచి టెయిల్ ఎండ్ వరకు అన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తున్నామన్నారు. ఇంటీరియర్ ప్యానెల్స్, సీటింగ్, బెర్త్, లైటింగ్, కోప్లర్స్, గ్యాంగ్వే ఇలా అన్ని అంశాలను ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని రూపకల్పన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బిఈఎంఎల్ ఇచ్చిన డిజైన్లను క్షుణ్ణంగా పరిశీలించాకే అనుమతులు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. 2029 నాటికి దేశవ్యాప్తంగా 250 స్లీపర్ రైళ్లను నడిపేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు.