కాంగ్రెస్ పాలనలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. స్వీపింగ్, శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం రూ . 40,000 కేటాయిస్తే నలుగురు తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారు అని కవిత గుర్తు చేశారు. వీరు టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారని, గత సంవత్సరం ఆగస్టు నెల నుండి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించినందున పిల్లలే టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణలోని బయటి పనులు అన్ని కూడా విద్యార్థులే రెగ్యులర్గా చేసుకోవాలని చెప్పారని కవిత పేర్కొన్నారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు గురుకుల పాఠశాలలోని వాచ్మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యాసంస్థలలో అసిస్టెంట్ కేర్ టేకర్లను తొలగించి వారు చేసే వార్డెన్ పనులను పిల్లలతో చేయించాలని చెప్తున్నారు. ఇప్పటివరకు వార్డెన్లే అన్ని రకాల నిర్వహణలు చూసుకున్నా పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునేవారు. కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ మరియు మెస్ పనులు కూడా చేయవలసి వస్తుందన్నారు.శ్రమను గౌరవించడం, నేర్పడం వేరు, విద్యార్థులతో వెట్టిచాకిరి చేయించడం వేరు. అసలు మొత్తంగా శానిటేషన్ వర్కర్స్ను తొలగించి ఆ పనులు పిల్లలతో రెగ్యులర్గా చేయించడం నేరమని కవిత పేర్కొన్నారు. ఇక్కడ ఆడియోలో వర్షిని గారు చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. బోర్డు తుడవడం టాయిలెట్ కడగడం ఒకటి కాదు. మేడం గారి పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను వీరు క్లీన్ చేయగలరా. అది కూడా రెగ్యులర్గా. సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదివే పిల్లలు ఏమైనా పోష్ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చారా? వెళ్లి కూర్చోగానే టేబుల్ పైకి ఫుడ్ రాదు అనడం.. ఎందుకు ఇలాంటి పనులు చేయరు చేయాల్సిందే అని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గం. ఈ వివక్షల నుండి తప్పించడానికే కదా ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయించి చదివించేది. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం కాదు. కుల వివక్ష, శ్రమ దోపిడీ మాత్రమే అని కవిత అన్నారు.
దీంతో పాటు 240 మంది అసిస్టెంట్ కేర్ టేకర్లను తొలగించడం కూడా. గతంలో లాగానే పిల్లలు క్వాలిటీ మాత్రమే తనిఖీ చేసుకునే ఏర్పాటు ఉండాలి. అంతే కానీ పిల్లలతో పూర్తిస్థాయి వార్డెన్, శానిటేషన్ వర్కర్స్ చేయించే పని చేయించడం కరెక్ట్ కాదు. నలుగురు శానిటేషన్ వర్కర్స్ ఒక వార్డెన్ మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో కలిపి 1200 మంది ఉద్యోగులను తొలగించడం అన్యాయం. ఒకవైపు ఉద్యోగాలు కల్పిస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పడం మరోవైపు అత్యవసరమైన చోట వారిని తొలగించి ఆ పని భారం విద్యార్థుల మీద ఉంచడం తప్పు అని కవిత పేర్కొన్నారు.
పోష్ పిల్లలు కాకపోయినా అందరూ పిల్లలు సమాజం దృష్టిలో, ప్రభుత్వం దృష్టిలో సమానమే అన్న సంకేతాలను పంపాల్సిన గురుకుల పాఠశాలలు వివక్ష కేంద్రాలుగా మారకూడదు. ఎస్సీ వర్గాల పిల్లలు ప్రధానంగా చదివే గురుకుల పాఠశాలలో ఈ నిర్ణయం మానవతావాదులు ముక్తకంఠంతో ఖండించవలసింది. కాంగ్రెస్ ప్రభుత్వ పేదల వ్యతిరేక ఆలోచన విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, తక్షణమే ఆ అధికారిని తప్పించాలి, నెలకు మెయింటెనెన్సు డబ్బులు పాఠశాలలకు ఇవ్వాలి. పిల్లలతో పనిచేయించటం ఆపివేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.