- జులానా నుంచి 4 వేల వోట్ల ఆధిక్యం
- హర్యానాలో కాంగ్రెస్ గెలుపు ఆశలు సఫలం కాకపోయినా.. అందరి దృష్టిని
- ఆకర్షించిన జులానా సీటులో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి, ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం
- సాధించారు. మొత్తం 15 రౌండ్లలో వినేశ్ ఫోగట్ 4వేలకు పైగా వోట్ల ఆధిక్యంలో గెలుపొందారు.
- ఈ విజయంతో మల్లయోధురాలు వినేశ్ ఫోగట్ ఎమ్మెల్యే అయ్యారు. పోస్టల్ బ్యాలెట్ వోట్లలో ఆధిక్యం
కనబర్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఫోగట్.. ఈవీఎం వోట్ల లెక్కింపులో మొదటి రౌండ్లో ముందంజలో దూసుకు పోయారు. ఆ తర్వాత రౌండ్లలో స్వల్పంగా వెనకపడ్డారు. మొదటి ఏడు రౌండ్లు పూర్తయ్యేసరికి కొంచెం వెనుకపడిన ఫోగట్.. 8వ రౌండ్ నుంచి ఆధిక్యాన్ని కనబర్చారు. 8,9,10, 11, 12 రౌండ్లలో ఆధిక్యం రావడంతో 12 రౌండ్లు ముగిసే సమయానికి 4వేలకు పైగా వోట్ల ఆధిక్యాన్ని ఫోగట్ సాధించారు. కాగా రైతు ఉద్యమాలు కమలం పార్టీని దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పారిస్ ఒలింపిక్స్ తర్వాత వినేశ్ ఫోగట్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. బరువు ఎక్కువుగా ఉన్నారనే కారణంగా ఆమె ఫైనైల్స్లో పాల్గొనలేకపోయారు. దీంతో పతకం లేకుండానే ఒలింపిక్స్ నుంచి వెనుదిరగాల్సి వొచ్చింది.
అంతకుముందు రెజ్లర్ల ఉద్యమంలో ఫోగట్ కీలకపాత్ర పోషించారు. కొన్నేళ్లుగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఆమె విమర్శలు చేస్తూ వొస్తున్నారు. రైతు చట్టాల విషయంలోనూ, రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఘటనలోనూ కేందప్రభుత్వ వైఖరిని ఆమె తప్పుపడుతూ వొచ్చారు. హర్యానా ఎన్నికల వేళ ఫోగట్ కాంగ్రెస్లో చేరాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మరో రెజ్లర్ భజరంగ్ పునియాతో కలిసి ఫోగట్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అప్పటినుంచి ఆమెను బీజేపీ సైతం టార్గెట్ చేసింది. జులానా నియోజకవర్గం నుంచి హస్తం పార్టీ తన అభ్యర్థిగా ఫోగట్ను ప్రకటించింది. హర్యానాలో కాంగ్రెస్ వేవ్ ఉందని, మరోవైపు ఫోగట్ హర్యానా బిడ్డ కావడంతో ఆమెపై సానుభూతి ఉందనే ప్రచారం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కనిపించనప్పటికీ జులనాలో మాత్రం ఫోగట్ విజయం సాధించారు. తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్పై 4 వేలకు పైగా వోట్ల ఆధిక్యంతో గెలుపొందారు.