సుక్మా జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కొంట – గొల్లపల్లి రోడ్డులో మావోయిస్టులు మరోసారి విరుచుకుపడ్డారు. ఐఇడీ బాంబ్ని పేల్చివేయడంతో కొంట అదనపు ఏఎస్పీ ఆకాశ్రావు గిర్పుంజే మృతి చెందారు. నూతన బేస్ క్యాంప్ సమీపంలో బాంబు పేలుడు సంభవించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. సుక్మా జిల్లా కొంటా చిక్వార్ గూడ మైన్లో ప్రొక్లెయిన్కు మావోయిస్ట్లు నిప్పు పెట్టారు. ఈ విషయం తెలియడంతో విచారణ కోసం ఘటనా స్థలానికి ఏఎస్పీ ఆకాశ్రావు గిర్పుంజే చేరుకున్నారు. ఈ సమయంలోనే మావోయిస్ట్లు మాటు వేసి ఏఎస్పీ వాహనాన్ని ఐఇడీ బాంబుతో పేల్చడంతో ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఏఎస్పీని స్థానిక ఆస్పత్రిలో వైద్యం కోసం తరలించారు. హాస్పిటల్లో ఏఎస్పీ ఆకాశ్రావు చికిత్స పొందుతూ మృతిచెందారు.