చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ విజ్ఞప్తి
చిలుకూరు బాలాజీ టెంపుల్ లో ‘వివాహ ప్రాప్తి’ కార్యక్రమం కొనసాగుతుందని ప్రతినెల కొంతమంది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఏడాది ఏప్రిలో 21వ తేదీనే స్వామి వారి వివాహ మహోత్సవం నిర్వహించామని ఈ కార్యక్రమం పూర్తయినప్పటికీ కొంతమంది పాత వీడియోలో ఏప్రిల్ నెలను తొలగించి 21వ తేదీన స్వామి వారి కల్యాణ మహోత్సవం జరుగుతుందంటూ ప్రతి నెల ఈ వీడియోను వైరల్ చేస్తున్నారన్నారు.
ఇలాంటి చర్యల వల్ల భక్తులను అయోమయానికి గురి చేయవద్దని ఆయన విజ్ఞప్తి చేస్తూ తాజాగా ఓ వీడియోను ఆయన రిలీజ్ చేశారు. కాగా, ఈ ఏడాది జరిగిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన గరుడ ప్రసాద వితరణ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలిరావడంతో తొక్కిసలాటతో పాటు భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దాంతో ఆ సమయంలో జరగాల్సిన వివాహ ప్రాప్తి కార్యక్రమాన్ని రద్దు చేశారు. కల్యాణ మహోత్సవం కోసం ఆలయానికి ఎవరూ రావొద్దని వివాహ ప్రాప్తి కోసం భక్తులు ఇంటి వద్ద స్వామివారిని ప్రార్థించుకోవాలని రంగరాజన్ గతంలో ప్రకటించారు.