-
ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాల్లో ఓట్ ఫర్ ఓపిఎస్
-
నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్ పెన్షన్ స్కీం సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ
ఈ సంవత్సరం ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలైన మహారాష్ట్ర, హర్యానా, జమ్మూకాశ్మీర్, జార్ఖండ్, ఢిల్లీలో ఓట్ ఫర్ ఓపిఎస్ను కొనసాగించాలని తీర్మానించారు. న్యూఢిల్లీలోని సుర్జీత్ భవన్ లో నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్ పెన్షన్ స్కీం సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ ఆధ్వర్యంలో నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న 22 రాష్ట్రాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏకగ్రీవంగా యూపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానించారు. దేశ వ్యాప్తంగా ఎన్పిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేయాలని, సెప్టెంబర్ 26వ తేదీన దేశంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో యూపిఎస్, ఎన్పిఎస్కి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయాలని, 2024 డిసెంబర్ 15న ఎన్ఎంఓపిఎస్ జాతీయ కన్వెన్షన్ ఢిల్లీలో నిర్వహించాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో ఎన్ఎంఓపియెస్ అధ్యక్షుడు వి.కె బంధు, రామాంజనేయులు, తెలంగాణ నుంచి కల్వల్ శ్రీకాంత్, నరేష్ గౌడ్, కర్ణాటక నుంచి శాంతారం , హర్యానా నుంచి దారివాల్, హిమాచల్ ప్రదేశ్ నుంచి ప్రదీప్ కుమార్, ఢిల్లీ నుండి మంజీత్ రానా మిగిలిన రాష్ట్రాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సెక్రటరీ జనరల్ స్థితప్రజ్ఞ మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ సంస్కరణలో కూడా 99,77,165 మంది ఉద్యోగుల నుంచి వసూలు చేసిన 10,53,850 కోట్ల రూపాయల పెన్షన్ నిధులను కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లనున్నాయని, సంపద కొద్దిమంది దగ్గరే కేంద్రీకృతం అవుతుందని, సంపద సృష్టించే వారు వృద్ధాప్యంలో కనీస పెన్షన్ కూడా నోచుకోలేకపోతు న్నారని ఆయన వాపోయారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.