- బడ్జెట్పై చర్చలో పరస్పర విమర్శలు
- హరీష్ రావు వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రులు
బడ్జెట్పై చర్చ సందర్బంగా విమర్శలు, ప్రతి విమర్శలు, సవాళ్లతో అసెంబ్లీ దద్దరిల్లింది. బడ్జెట్ చర్చలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విమర్శలపై అధికార పార్టీ సభ్యులు ఘాటుగా సమర్పించారు. సిఎం భాషపై హరీష్ రావు ప్రతి విమర్శలు చేశారు. దీంతో సభలో లేని నాయకుడిపై విమర్శలు చేయడం సరికాదని స్పీకర్ ప్రసాదరావు సూచించారు. ఒకానొక సందర్భంలో చేసిన వ్యాఖ్యలను అసెంబ్లీలో ప్రస్తావించడం దారుణమని మంత్రి శ్రీధర్ బాబు ఎదురుదాడి చేశారు.
బిఆర్ఎస్ హయాంలో తమకు కనీసం ఐదు నిమిషాలు కూడా మాట్లాడనిచ్చేవారు కాదని, ఇప్పటికే హరీష్ రావు రెండుగంటలకు పైగా మాట్లాడారని అన్నారు. సభా నాయకుడిని పట్టుకొని అజ్ఞానం అని మాట్లాడడం సరికాదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హితువు పలికారు. కాంగ్రెస్ వారికి బుద్ధిమాంద్యం ఉందని మాట్లాడడం సరికాదని, విజ్ఞులైతే స్పీకర్ చెప్పింది విని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
హరీష్ రావుకు భట్టి కౌంటర్
బడ్జెట్పై శాసన సభలో సాధారణ చర్చ సందర్భంగా హరీష్ రావుకు భట్టి కౌంటర్ ఇచ్చారు. ’సభాపతితో కూడా వాగ్వాదం చేయడం సరికాదు, మాకు బుద్ధి ఉందో మీకు ఉందో లెక్కలు వేసుకుని చెబుతాం, సభా నాయకుడు, ప్రభుత్వ పెద్దల గురించి సరైన భాష వాడాలని సూచించారు. బడ్జెట్ పరిధి దాటి అడ్డగోలుగా మాట్లాడడం సబబుకాదని భట్టి హెచ్చరించారు. ఇకపోతే అదేపనిగా కెసిఆర్ను విమర్శించడం మాని పాలనపై దృష్టి పెట్టాలని హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన మొత్తం అప్పు రూ.4.22 లక్షల కోట్లు అని హరీష్ రావు అన్నారు. రాష్ట్రం దివాళా తీసిందని పదే పదే చెప్పవద్దని.. బీఆర్ఎస్పై కోపంతో అప్పుల లెక్క ఎక్కువ చేసి చూపొద్దని కోరారు.
ఇది అవాస్తవిక బడ్జెట్.. గాలి మేడల బడ్జెట్ అని తీవ్రంగా విమర్శించారు.కృష్ణా నదీ జలాలపై ఈ బడ్జెట్లోనే చర్చ పెట్టాలి. నిర్వాకం వల్ల ఈ ఏడాది 34 శాతం వాడాల్సిన నీళ్లలో.. 24 శాతమే వాడారు. ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాల్లో పంటలు ఎండుతున్నాయి. నీటిని రాబట్టడంలో ప్రభుత్వం ఎలా విఫలమైందో చర్చించాలి. తెలంగాణకు వరంగా ఉన్న సెక్షన్3ని భారాస సాధించింది. ట్రిబ్యునల్ ముందు బలమైన వాదనలు వినిపించాలి. తెలంగాణకు న్యాయబద్ధమైన 575 టీ-ఎంసీలను రాబట్టాలని హరీష్ రావు అన్నారు. తెలంగాణ అప్పు రూ.8.6 లక్షల కోట్లు-గా ఉందని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి అన్నారు.
రోజుకు రూ.1700 కోట్లకుపైగా కాంగ్రెస్ సర్కారు అప్పు చేస్తోందని విమర్శించారు. బడ్జెట్పై శాసనసభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. నిమిషానికి రూ.కోటికిపైగా కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు చేస్తోంది. రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రుణభారం రూ.2.27 లక్షలుగా ఉంది. పెద్ద ఎత్తున రుణాలుంటే తెలంగాణ ఎలా అభివృద్ధి చెందుతుందో చెప్పాలి. యూపీఏ కంటే ఎన్డీఏ హయాంలో ఆర్థిక సంఘం నిధులు పెరిగాయి. యూపీఏ హయాంలో రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 32 శాతం వాటా ఉండేది. అప్పుడు కేంద్ర పన్నుల్లో వాటా 2-3 శాతం కూడా పెంచలేదు. మోదీ ప్రభుత్వం వచ్చాక కేంద్ర పన్నుల్లో వాటా 10 శాతం పెంచి 42 శాతం చేశారు. పన్నుల్లో వాటా పెంచాక కూడా కేంద్రాన్ని విమర్శించడం సరికాదని ఆయన అన్నారు.