శాసనసభలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఆర్టీసీ అంశంపై బీఆర్ఎస్ నేత హరీశ్రావుకు, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టులు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, పీఆర్సీ బకాయిల గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు ప్రశ్నించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఉంటుందా లేదా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆర్టీసీ కార్మిక సంఘాలను ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారని అడిగారు. దీంతో హరీశ్ రావుపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఎదురుదాడి చేశారు. దీనికి సమాధానం ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్.. గత ప్రభుత్వంపై, బీఆర్ఎస్ నేతలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆర్టీసీ కార్మికులపై ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా గతంలో పట్టించుకోలేదని మండిపడ్డారు. సమ్మె సమయంలో ఖమ్మంలో కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడని, అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. ఎన్నికల ముందు ఆదరబాదరాగా ప్రభుత్వంలో విలీనం చేశారని ఆరోపించారు. అయితే తమ ప్రభుత్వం ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించిందన్నారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి ఇప్పటికే రూ.2 వేల కోట్లు ఇచ్చామన్నారు. ఆర్టీసీని పూర్తిగా చంపేందుకు గతంలో బీఆర్ఎస్ ప్రయత్నం చేసిందని చెప్పిన మంత్రి పొన్నం.. తమ సర్కార్ ఆర్టీసీకి నెలకు రూ.300 కోట్లు ఇస్తున్నదని వివరించారు. ప్రజారవాణా, ఆర్టీసీ అభివృద్ధి, కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఆర్టీసీకి కొత్త బస్సులు కొంటున్నట్లు చెప్పారు. 3,035 మంది ఉద్యోగులను నియమిస్తున్నామనీ, పనిభారం పెరిగినా ఆర్టీసీ కార్మికులు బాగా పనిచేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ కితాబిచ్చారు.సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ, గత ప్రభుత్వం వ్యవహరించినట్టుగా కాకుండా, కార్మికులు, సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
సమాధానం చెప్పలేక పారిపోయారు..!
ఆర్టీసీ కార్మికుల సమస్యలపై సమాధానం చెప్పలేక కాంగ్రెస్ ప్రభుత్వం పారిపోయిందని హరీశ్రావు ఆరోపించారు. అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని గమనిస్తున్నారని, ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, ఆర్టీసీ యూనియన్ను పునరుద్ధరణ చేయడం లాంటి సమస్యలపై ప్రభుత్వం ఇప్పటి వరకు కార్యచరణ చేపట్టలేదని మండిపడ్డారు. తాము ప్రశ్నలు అడిగితే ప్రభుత్వం దగ్గర సమాధానం లేక వాయిదా వేసి పారిపోయిందని ఎద్దేవా చేశారు.