నగరంలో పలుచోట్ల ఎన్ఐఏ తనిఖీలు
తెలంగాణలో ఉగ్రవాదులు పేలుళ్లకు కుట్ర చేస్తున్నారనే సమాచారంతో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) వరంగల్లో పలుచోట్ల సోదాలు నిర్వహించింది. ఉగ్ర కుట్రలో ఏపీ పోలీసులు పట్టుకున్న విజయనగరానికి చెందిన సిరాజ్, హైదరాబాద్కు చెందిన సమీర్ 20 మందితో సోషల్ మీడియాలో ఓ గ్రూపు ఏర్పాటు చేసినట్లుగా ఎన్ఐఏ గుర్తించింది. సౌదీలో ఉంటున్న అబూ ముసబ్తో వీరు కాంటాక్టులో ఉన్నట్లుగా గుర్తించారు. వీరంతా సోషల్ మీడియా గ్రూపులో తరచూ మాట్లాడుకోవడం, చాటింగ్ చేసేవారు. సిరాజ్ను విచారించే క్రమంలో సోషల్ మీడియా గ్రూపులో వరంగల్కు చెందిన పరహన్ సభ్యుడిగా ఉన్నట్లుగా ఎన్ఐఏ బృందం దృష్టికి వచ్చింది. దీంతో వారం రోజులుగా హైదరాబాద్, వరంగల్లలో దర్యాప్తు చేస్తున్నారు. సమీర్ ద్వారా వరంగల్కు చెందిన పరహన్తో సిరాజ్కు పరిచయం ఏర్పడింది. జిహాద్ కోసం అవసరమైతే ప్రాణత్యాగానికి సిద్ధమవ్వాలని సోషల్ మీడియా గ్రూపులో చాటింగ్లు చేసుకున్నట్లు ఎన్ఐఏ తనిఖీల్లో వెల్లడైంది. గత వారం వరంగల్లో పరహన్ను అదుపులోకి తీసుకుని విచారించగా వరంగల్, కాజీపేటలకు చెందిన మరో ఇద్దరి పేర్లు చెప్పినట్లు సమాచారం. ఈ ముగ్గురిని వేర్వేరుగా ఎన్ఐఏ బృందం విచారించింది. అయితే వీరికి ఎలాంటి ఉగ్ర కుట్రలో భాగస్వామ్యం లేదని తేలినట్లుగా స్థానిక పోలీసుల సమాచారం. కాగా ఉగ్ర కుట్రలపై ఎన్ఐఏ తనిఖీల విషయం ఆలస్యంగా శనివారం వెలుగులోకి వచ్చింది.