Wednesday, April 2, 2025

రూ.500ల బోనస్ అనేది సన్నధాన్యం నుంచి మొదలుపెడతాం

  • స్వార్థ రాజకీయాల కోసం రైతులను బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు వాడుకుంటున్నారు
  • రైతుల పేరు మీద రాజకీయాలు చేయొద్దు
  • గత ప్రభుత్వం తడిచిన వడ్లను కొనలేదు
  • తాము తడిచిన ధాన్యాన్ని ఎమ్మెస్పీ రేటుకే కొంటున్నాం: డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు స్వార్థ రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారని, రూ.500ల బోనస్ సన్న ధాన్యానికే అని విపక్షాలు విమర్శిస్తున్నాయని, రూ.500ల బోనస్ అనేది సన్నధాన్యం నుంచి మొదలుపెడతామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క తెలిపారు. గత ప్రభుత్వం తడిచిన వడ్లను కొనలేదని ఆయన విమర్శించారు. తాము తడిచిన ధాన్యాన్ని ఎమ్మెస్పీ రేటుకే కొంటున్నామని ఆయన తెలిపారు. 15 రోజుల ముందు నుంచి వడ్లు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించామని ఆయన చెప్పారు.

మంగళవారం గాంధీభవన్‌లో డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్, బిజెపి నాయకులు అడ్డగోలుగా మాట్లాడొద్దని ఆయన సూచించారు. చివరి గింజ వరకు వడ్లు కొంటామని ఆయన వెల్లడించారు. సన్న వడ్లకు రూ.500ల బోనస్‌తో మొదలు పెడతామని ఆయన చెప్పారు. రైతుల పేరు మీద రాజకీయాలు చేయొద్దని ఆయన సూచించారు. ధాన్యం కొనుగోలుపై తప్పుడు ప్రచారం మానుకోవాలని భట్టి విక్రమార్క చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జాప్యం జరగకుండా చూస్తామని ఆయన హామినిచ్చారు.

ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ
ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తామన్నారు. గతంలో కంటే ఎక్కువగా 7,215 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామన్నారు. గత ప్రభుత్వం కంటే ఎక్కువగా తాము ధాన్యం కొనుగోలు చేశామన్నారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యాన్ని గత ప్రభుత్వం కొనలేదన్నారు. తడిచిన, మొలకెత్తిన ధాన్యానికి కూడా ఎంఎస్పీ ధరను ఇచ్చి కొంటామన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దు అన్నారు. రైతులందరూ ధైర్యంగా, నిశ్చింతగా ఉండాలని ఆయన కోరారు.

ప్రభుత్వం తీసుకుంటున్న రైతు అనుకూల నిర్ణయాలు ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని ఆయన ఆరోపించారు. అన్నదాతల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పెరగడంతో ప్రతిపక్షాలు అక్కసు వెళ్ల గక్కుతున్నాయన్నారు. ఇది ప్రజల ప్రభుత్వమని, ప్రజలకు ఇబ్బందులు రానివ్వమని ఆయన హామినిచ్చారు. నేటి యువత సాంకేతికతను అందిపుచ్చుకోవాలని వాతావరణ శాఖ సూచనలను రైతులకు అందించాలని డిప్యూటీ సిఎం భట్టి సూచించారు. వర్ష సూచనపై ఎప్పటికప్పుడు రైతులకు సమాచారం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. అబద్ధాలు చెప్పడం బిఆర్‌ఎస్ నేతలకు అలవాటుగా మారిందని ఆయన ఎద్దేవా చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com