విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలి
˜మాజీ మంత్రి హరీష్ రావు
అసెంబ్లీలో పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన బీసీ బిల్లును బీఆర్ఎస్ పార్టీ పక్షాన మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ పూర్తి మద్దతు తెలుపుతున్నామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ప్రకటించారు. శాసనసభలో బీసీ బిల్లు పై ఆయన మాట్లాడుతూ.. విద్యా, ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ వచ్చినప్పుడే బిసీ వర్గాలు నిజంగా సంతోషపడతామని చెప్పారు. స్థానిక సంస్థల్లో, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం రిజర్వేషన్ ఫలితాలు వారికి అందినప్పుడు ఆ వర్గాల్లో సంతృప్తి వ్యక్తమవుతుందని అన్నారు. రాష్ట్ర శాసనసభలో మనం బిల్లు ఏర్పాటు చేయడంతో పాటు పార్లమెంట్ లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తుందని అన్నారు.
ఈ బిల్లు పాస్ కావాలంటే రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ 100 మంది ఎంపీలు ఉన్నారు. ఈ బిల్లు కోసం రాహుల్ గాంధీ గట్టిగా పూనుకోవాలి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ లో, డైరెక్టర్లు లో బీసీలకు బిఆర్ఎస్ ప్రభుత్వం 50% రిజర్వేషన్ తెచ్చింది. మొట్టమొదటిసారిగా దేశంలో ఎక్కడాలేని విధంగా గౌడన్నల కోసం మద్యం షాపుల్లో రిజర్వేషన్ తెచ్చింది. బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన మూడు అంశాలను బేషజాలకు పోకుండా చేర్చాలి. బీసీలపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నిజమైన ప్రేముంటే ఈ మూడు అంశాలను చేర్చాలి.
ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలి. బిల్లులో ఈ అంశం చేర్చడానికి దిల్లీ పర్మిషన్ అవసరం లేదు. రేపటి నుండే రాష్ట్రంలో బీసీలకు 42% కాంట్రాక్టు పనుల్లో అవకాశం లభిస్తుంది. బీసీలకు సబ్ ప్లాన్ అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. క్యారీ ఫార్వర్డ్ విధానంలో అమలు చేయాలి. క్యారీ ఫార్వర్డ్ విధానంలో కేసీఆర్ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ను అమలు చేశారు. బీసీ బిల్లు ఆమోదం కోసం దిల్లీకి సైతం వొచ్చి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఆమోదం విషయం పార్లమెంట్ చేతిలో ఉంది కాబట్టి భేషజాలకు పోకుండా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇచ్చిన మాట ప్రకారం బీసీ సబ్ ప్లాన్ ను చేర్చండి. బడ్జెట్లో 20,000 కోట్ల రూపాయలు నిధులు పెట్టాలని, కాంట్రాక్ట్ లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.