పాలకుల దోపిడీ నుంచి తెలంగాణను కాపాడాలి
రాష్ట్రంలో ముఖ్యమంత్రి గ్రాఫ్ పడిపోతోంది..
ఇంత తొందర్లో ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనుకోలేదు..
ఉప ఎన్నికలకు సన్నద్ధం కావాలి..
ఏప్రిల్ 27న బీఆర్ఎస్ బహిరంగ సభ
బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేత కేసీఆర్
తెలంగాణలో 100 శాతం మళ్లీ అధికారంలోకి వొచ్చి తీరుతామని మాజీ సీఎం, బిఆర్ ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు, సిల్వర్ జూబ్లీ వేడుకలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చర్చించారు. పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ సిల్వర్జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఏడాది పొడవునా ఘనంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ కమిటీలు వేయాలని, కమిటీలకు ఇన్చార్జ్గా మాజీ మంత్రి హరీష్రావుకు బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే మహిళా కమిటీలను ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. ఏప్రిల్ పదో తేదీ నుంచి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని, ప్రతీ జిల్లా కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు కొనసాగుతుందని కేసీఆర్ వెల్లడించారు.
అనుబంధ సంఘాల బలోపేతానికి సీనియర్ నాయకులతో సబ్ కమిటీలు వేయన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. తెలంగాణ సమాజం సామాజిక చారిత్రక అవసరాల దృష్ట్యా తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్(టిఆర్ఎస్). తెలంగాణ రాజకీయ అస్తిత్వ పార్టీగా, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తన చారిత్రక బాధ్యతను నిర్వహించిన తెలంగాణ ప్రజల పార్టీ బీఆర్ఎస్. తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్యపరుస్తూ, తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేసంది. గతం గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాల పాలు కాకుండా, గత దోపిడీ వలస వాదుల బారిన పడకుండా, తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలి. పార్టీని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని.. ఇటు తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పని చేయాలి. పార్టీ ఆవిర్భవించి 25వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న తరుణంలో సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏడాది కాలం పాటు నిర్వహించాలి. విద్యార్థి, మహిళా సహా పార్టీ అనుబంధ విభాగాలను మరింత పటిష్టపరచాలి. అందుకోసం సీనియర్ పార్టీ నేతలతో కూడిన సబ్ కమిటీ లను ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రారంభించాలి అని కేసీఆర్ నేతలకు దిశానిర్దేశంచేశారు.
తెలంగాణ రాష్ట్రం మరోసారి దోపిడీ, వలసవాదుల బారినపడకుండా తెలంగాణను కాపాడాలి. తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయమే బీఆర్ఎస్ లక్ష్యం. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది. రాష్ట్ర ముఖ్య మంత్రిపై ప్రజల్లో ఇంతలా వ్యతిరేకత ఇంత తొందరగా వొస్తుందనుకోలేదన్నారు. తెలంగాణలో కచ్చితంగా ఉప ఎన్నికలు వొస్తాయి. ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆదాయం పడిపోతుంది. మనం ఏటా ఆదాయం పెంచుకుంటూ వెళ్లాం. అదే అధికారులు ఉన్నారు కానీ.. ఈ ప్రభుత్వానికి పని చేయించుకోవడం రావడం లేదు. అని కేసీఆర్ విమర్శించారు.
వందశాతం మళ్లీ అధికారంలోకి వొస్తాం..
రాష్ట్రంలో మళ్లీ వంద శాతం అధికారంలోకి వొస్తామని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. స్వరాష్ట్ర ఉద్యమం, తెలంగాణ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. పార్టీ కార్యకర్తలు ప్రజల కోసం పోరాటం చేయాలి. బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ కోసం పోరాడగలదు. ప్రజల కష్టాలు బీఆర్ఎస్కు మాత్రమే తెలుసు. వందశాతం మళ్లీ అధికారంలోకి వస్తాం. పోరాడి సాధించుకున్న తెలంగాణ కాంగ్రెస్ పాలనలో మళ్లీ వెనక్కి వెళ్లుతోంది. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్లీ తెలంగాణను నిలబెట్టుకునేందుకు పోరాడాలని అని కేసీఆర్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, పొన్నాల లక్ష్మయ్య, సబితా ఇంద్రారెడ్డి ,నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, వినోద్ కుమార్ మాజీ స్పీకర్లు సిరికొండ మధుసూదనాచారి, సురేష్ రెడ్డి, శ్రీనవాస్ గౌడ్, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు పాల్గొన్నారు.