- అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం చేస్తాం
- బషీరాబాద్ స్థలం అప్పగింత సభలో సీఎం రేవంత్ రెడ్డి
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు…అర్హులైన ప్రతి జర్నలిస్టుకు తమ ప్రభుత్వం న్యాయం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులు సమాజానికి చికిత్స చేసే డాక్టర్లు వంటి వారన్నారు. ఈ నేపథ్యంలో జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉంటుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించే ఫోర్త్ సిటీలో ఇండ్ల స్థలాలు కూడా ఇస్తుందన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు పూర్తిగా స్వేచ్చ ఇస్తున్నామన్నారు.
ఆదివారం రవీంద్ర భారతిలో జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచివల్లి ఎయిడెడ్ కో..ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (జెఎన్ జె)కి పేట్ బసీరాబాద్ లోని 38 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రూపొందించిన మెమోను సీఎం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని స్పష్టం చేశారు. వారి సంక్షేమం కోసం గతంలో వైఎస్ఆర్ నిర్ణయం తీసుకున్నారన్నారు. తదనంతరం జరిగిన పరిణామాల కారణంలో సుమారు 18 సంవత్సరాల పాటు స్థలాల కోసం జర్నలిస్టులు ఎదురుచూడాల్సి రావడం విచారకరమన్నారు.
తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఆ స్థలాలు దక్కుతుండడం ఆనందంగా ఉందన్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా పోరాడిన జర్నలిస్టుల కల నెరవేరినట్లు అయిందన్నారు. సొసైటీలో ఉన్న 1100 మంది జర్నలిస్టులకు ఈ రోజు నిజమైన పండుగ రోజన్నారు.ఈ స్థలాలను ఇవ్వడం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చిక్కుముళ్లను పరిష్కరించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ సమావేశాలకు జర్నలిస్టులకు అనుమతి లేదన్నారు. జర్నలిస్టులు వృత్తిపరమైన గౌరవాన్ని పెంచుకోవాలన్నారు. ఈ వ్యవస్థలపై నమ్మకం పెంచడమే మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. జర్నలిస్టులు పార్టీ కార్యకర్తలగా వ్యవహరించవద్దన్నారు. కొన్ని రాజకీయ పార్టీలే పత్రికలు నడుపుతున్నాయన్నారు. సిద్దాంతాలను ప్రచారం చేసుకొనే పత్రికలు ఎక్కువయ్యాయన్నారు. కొంతమంది అనవసర రాద్దాంతం చేస్తున్నారన్నారు. కొంతమంది ఏది పడితే అది మాడ్లాడుతున్నారంటూ.. ఇలాంటి విధానానికి మీరే పరిష్కారం చూపాలన్నారు.
వృత్తి పరమైన గౌరవాన్ని ఎవరూ పెంచరని…అది మనకు మనమే పెంచుకోవాలన్నారు. ప్రజాభిప్రాయం, జర్నలిస్టుల సూచనలతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు.. వ్యవస్థలపై నమ్మకం పెంచాలన్నదే తమ ప్రభుత్వ విధానమన్నారు. జర్నలిజం కూడా వ్యవస్థల్లో ఒక భాగమేనని అన్నారు. ఆనాడు రాజకీయ పార్టీలు సిద్ధాంత భావజాల వ్యాప్తి కోసమే పత్రికలు ఏర్పాటు చేసుకునేవి. కానీ ఈరోజుల్లో ఉన్మాద ధోరణితో వ్యవహరించే పరిస్థితులు దాపురించాయని అని రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కొందరు చేసే పనులతో జర్నలిస్టులందరికీ చెడ్డపేరు వస్తోందన్నారు. కొంతమంది జర్నలిస్టు పదం అర్ధాన్నే మార్చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అలాంటి వారిని నియంత్రించే బాధ్యత జర్నలిస్టుల సంఘాల నేతలపైనే ఉందన్నారు. నిజమైన జర్నలిస్టులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసుకునే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. అయితే భాష విషయంలోనూ కొన్ని పత్రికలు గీత దాటుతున్నాయన్నారు. చివరకు ముఖ్యమంత్రి హోదానూ అవమానపరిచేలా వ్యవహరిస్తున్నారన్నారు. కేవలం రాజకీయ పార్టీల యజమానులను రక్షించేందుకే వారు ప్రాధాన్యతనిస్తున్నారని ఆక్షేపించారు. అలాంటి వారిపై తీసుకునే చర్యలను నిజమైన జర్నలిస్టులు ఆపాదించుకోవదన్నారు.ఆరోగ్య భద్రత కార్డులు, అక్రిడేషన్ ఇతర సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం.. మీడియా అకాడమీ కొత్త విధి విధానాలు తయారు చేయాలని ఆదేశిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వాటికి కేబినెట్ ఆమోదం తెలిపే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు.