కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మెట్రో ఆగింది.
•ఆయనది కచ్చితంగా సైంధవ పాత్రే..
•గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
దక్షిణాది రాష్ట్రాలను ఆర్థికంగా రాజకీయంగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని, బీజేపీ కుట్రలను సాగనివ్వం కేంద్రం చర్యలను దీటుగా ఎదుర్కొంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గాంధీ భవన్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వ్యాఖ్యలకు ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మోదీ గుజరాత్ నుంచి రైళ్లల్లో నోట్ల కట్టలు పంపిస్తున్నట్లు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మేం మోదీ ఆస్తులనో, కిషన్ రెడ్డి ఆస్తులనో అడగడం లేదు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన వాటినే కేంద్రాన్ని అడుగుతున్నాం. కిషన్ రెడ్డి అడ్డుపడటం వల్లే మెట్రో ఆగింది. మూసీకి నిధులు అడిగితే అవహేళన చేస్తున్నారు.
సబర్మతిని, గంగానదిని, యమునా నదిని వాళ్లు ప్రక్షాళన చేయొచ్చు కానీ మేం మూసీని ప్రక్షాళన చేయొద్దా? కిషన్ రెడ్డి వంద శాతం సైంధవ పాత్ర పోషిస్తున్నాడు. రీజనల్ రింగ్ రోడ్ పై ఆనాడు మోదీ స్పష్టమైన ప్రకటన చేసింది నిజం కాదా? ఎందుకు మెట్రోను కేంద్రమంత్రివర్గ ఎజెండాలో పెట్టడంలేదు? ఎజెండాలో పెట్టొద్దని మంత్రివర్గంపై ఒత్తిడి తెస్తోంది ఎవరు? ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన ప్రాజెక్టు ఏమైనా తెచ్చారో కిషన్ రెడ్డి చెప్పాలి.
మీరు బెదిరిస్తే భయపడటానికి ఇక్కడ భయపడేవారు ఎవరూ లేరు. మేం రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన నిధులే అడుగుతున్నాం. కిషన్ రెడ్డి ఒక్కరోజైనా మోదీ దగ్గర తెలంగాణ రాష్ట్రానికి కావలసినవి ఏమైనా అడిగారా? ఏ పార్లమెంట్ సమావేశంలో మీరు మాట్లాడారో చెప్పండి? ఖచ్చితంగా కిషన్ రెడ్డిది సైంధవ పాత్రనే. కెసిఆర్ దిగిపోయారనే బాధతో కిషన్ రెడ్డి మాపై పడుతున్నారు.