- రాష్ట్రంలో వ్యసనాలకు తావు లేదు
- దీనికి శాశ్వత పరిష్కారం కోసం చర్యలు
- శాంతిభద్రతలు క్షీణించాయంటూ కొందరు చవకబారు విమర్శలు
- రాష్ట్రాన్ని దివాలా తీయించి ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు
- ఉప ఎన్నికలు రావు.. ఎమ్మెల్యేలు ఆందోళన చెందొద్దు..
- ప్రతిక్షాలపై మండిపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ పై కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కేవలం ప్రచారం కల్పించేవారిని విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదని, పక్క రాష్ట్రాలు, పక్క దేశాల్లో కూడా విచారణ చేయాల్సి ఉంటుందన్నారు. శాసన సభలో సీఎం రేవంత్ ప్రసంగిస్తూ.. బెట్టింగ్ యాప్స్ పై అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీమ్ ను నియమించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఎవరైనా ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహించినా, నిర్వహణలో భాగస్వాములైనా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. అవసరమైతే చట్ట సవరణ చేసి శిక్షను పెంచాల్సిన అవసరం ఉంది.
వ్యసనాలకు తెలంగాణలో తావులేదు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని కొందరు మాట్లాడుతున్నారు. ఏ చిన్నసంఘటన జరిగినా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. నడిబజారులో న్యాయవాద దంపతులను నరికి చంపితే ఆనాటి ప్రభుత్వం స్పందించలేదు. ఆనాటి వెటర్నరీ డాక్టర్ అత్యాచార ఘటన విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. మహిళలపై జరిగిన అత్యాచారాల్లో 2020 లో దేశంలోనే రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది.
బాధితులపై సానుభూతితో ఉండి నేరగాళ్లపై కఠినంగా వ్యవహరించాలి. కానీ ఇలాంటి ఆరోపణలు చేసి ప్రభుత్వంపై దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా శాంతిభద్రతలు క్షీణించాయని అసత్యాలు మాట్లాడుతున్నారు. తెలంగాణ అభివృద్ధిపై యాసిడ్ దాడులు చేస్తున్న పరిస్థితి ఉంది. రాష్ట్రాన్ని దివాలా తీయించి తెలంగాణ ప్రతిష్టను మసకబార్చేలా కుట్రలు చేస్తున్నారు. ఈ కుట్రలను తెలంగాణ సమాజం సహించదు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.