-
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏం జరిగింది..?
-
పిటిషన్ ఉపసంహరించుకున్న ఎంఎల్సీ కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ సీబీఐ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. రౌస్ అవెన్యూ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉపసంహరించుకున్నారు. సోమవారం డీఫాల్ట్ బెయిల్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసింది. ఆగస్టు-7కు తదుపరి విచారణను వాయిదా వేస్తున్నట్లు జడ్జ్ కావేరి భవేజా స్పష్టం చేశారు. సీనియర్ అడ్వకేట్ అందుబాటులో లేకపోవడంతో కేసును మరో రోజుకు వాయిదా వేయాలని కవిత తరఫు లాయర్ కోర్టును కోరారు. ఈ క్రమంలో తదుపరి విచారణను జడ్జ్ కావేరి భవేజా వాయిదా వేశారు. అయితే రౌస్ అవెన్యూ కోర్టులో రేపు తుది విచారణ జరిగే క్రమంలో కేసును కవిత న్యాయవాదులు ఉపసంహరించుకోవడం సంచలనంగా మారింది.
జులై 6న పిటిషన్ సీబీఐ చార్జ్ షీట్లో తప్పులు ఉన్నాయని కవిత డిఫాల్ట్ బెయిల్కు అర్హురాలని జులై 6న కవిత తరఫు న్యాయవాదులు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ వేశారు. చార్జ్ షీట్లో తప్పులేవీ లేవని సీబీఐ తెలిపింది. అనంతరం సీబీఐ చార్జ్ షీట్ను జులై 22న కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఆగస్టు 9న చార్జ్ షీట్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. కాగా.. కవితను మార్చి-15న తొలుత ఈడీ, ఆ తర్వాత ఏప్రిల్-11న సీబీఐ అరెస్టు చేశాయి. ఈడీ, సీబీఐ పెట్టిన రెండు కేసుల్లోనూ సాధారణ బెయిల్ ఇవ్వాలన్న పిటిషన్ను గతంలో ట్రయల్ కోర్టు కొట్టివేసింది. ఈ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టులో కవిత సవాల్ చేశారు. అయితే ఆమెకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఈ నేపథ్యంలోనే ఆమె ట్రయల్ కోర్టులోనే మళ్లీ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరుగుతుండగానే పిటిషన్ విత్ డ్రా చేసుకున్నారు
వ్యూహంలోనే భాగమేనా?
తిహార్ జైలులో ఉన్న కవితను బయటకు తీసుకువచ్చేందుకు మాజీ మంత్రులు కల్వకుంట్ల కేటీఆర్, తన్నీరు హరీశ్రావు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. రౌస్ అవెన్యూ కోర్టు, సుప్రీంకోర్టులో చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల అంశంతోపాటు కవిత బెయిల్ పై న్యాయ నిపుణులతో చర్చించేందుకు కేటీఆర్, హరీశ్రావులు శనివారం సాయంత్రమే ఢిల్లీకి చేరుకున్నారు. ఆదివారం సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులను కలిసి సంప్రదింపులు జరిపారు. వారి సూచనల మేరకే డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ ను ఉపసంహరించుకున్నట్లు తెలుస్తున్నది.