అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కార్చిచ్చు భీబత్సం సృష్టిస్తోంది. కాలిఫోర్నియా రాష్ట్రంలో కార్చిచ్చు అడవిని దహించివేస్తోంది. కాలిఫోర్నియా దక్షిణభాగంలో లైన్ ఫైర్ కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తోంది. కొన్ని వేల ఎకరాలను ఈ కార్చిచ్చు కాల్చి బూడిద చేస్తోంది. దీంతో వేలాది మంది ప్రజలు ఆ ప్రాంతాలను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చు అతి కొద్ది సమయంలోనే భీకర రూపం దాల్చింది. లాస్ ఏంజెల్స్కు తూర్పున అటవీ ప్రాంతంలో, నెవాడాలోని ఇక్కడి రీజినల్ పార్క్లో చెలరేగిన మంటలు అదుపు తప్పాయి.
అకస్మాత్తుగా చలరేగిన ఈ కార్చిచ్చు కారణంగా చుట్టుపక్కల ప్రాంతాలకు భయంకరమైన వేడి గాలులు వీస్తున్నాయి. దీంతో గత రెండు, మూడు రోజులుగా కాలిఫోర్నియాలో, నెవాడాలోని వాషూ కౌంటీలో అత్యవసర పరిస్థితి ప్రకటించింది ప్రభుత్వం. ఈ కార్చిచ్చు వల్ల రెనోలో సుమారు 20 వేల మందిని వేరేచోటుకు తరలించారు అధికారులు. మరోవైపు దాదాపు 100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. కాలిఫోర్నియా, నెవాడా రాష్ట్రాల్లోని ప్రభావిత ప్రాంతాల్లో ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి స్థానిక ప్రభుత్వాలు. మంటలు అదుపులోకి వచ్చే సరికి మరో వారం రోజుల సమయం పట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.