బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల
ఉచిత బస్సు సౌకర్యాన్ని కొందరు మహిళలు దుర్విని యోగం చేయడంపై ఆయన కామెంట్స్ చేశారు. అవసరమైతే బస్సుల్లో డ్యాన్సులు చేయాలనడం వివాదాస్పదమైంది. దీనిని సుమోటోగా స్వీకరించిన మహిళా కమిషన్ ఈ నెల 24వ తేదీన కమిషన్ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.
రెండు రోజుల క్రితం ఆయన తెలంగాణ భవన్ లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ, ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. కొందరు ఉచితంగా బస్సుల్లో ప్రయాణిస్తూ కూరగాయలు అమ్మడం, మరి కొందరేమో బ్రష్ చేయడం, ఇంకొద్దరూ వెల్లుల్లి ఒలుస్తూ కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.
కుట్లు, అల్లికలే మాత్రమే కాదు… అవసరమైతే బస్సుల్లో ప్రయాణిస్తూ డ్యాన్సులు కూడా చేసుకోండని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా మంత్రి సీతక్క స్పందించారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు మహిళలను గౌరవించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. వివాదం పెద్దది కావడంతో మహిళా కమిషన్ ఆ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని విచారణకు హాజరు కావాలంటూ శుక్రవారం నోటీసులు పంపింది.
దీనిపై కేటీఆర్ స్పందిస్తూ పార్టీ సమావేశంలో తాను చేసిన వ్యాఖ్యలు యథాలాపంగా చేసిన కామెంట్స్ అని, తన వ్యాఖ్యలతో సోదరీమణులకు మనస్తాపం చెందితే విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు. అక్క చెల్లెమ్మలను కించపరిచే ఉద్దేశంతో ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. తన వ్యాఖ్యలను తప్పుగా తీసుకోవద్దని, కావాలని చేసిన వ్యాఖ్యలు కాదని.. తన వ్యాఖ్యలపై కేటీఆర్ విచారం వ్యక్తం చేస్తూ సారీ చెప్పారు.