బైక్ మైలేజీ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ప్రపంచ ఆటోమోబైల్ రంగంలో విప్లవాత్మకమైన అడుగు పడింది. అందులో భారత్ ఘనమైన కీర్తిని మూటగట్టుకుంది. ఇండియాకు చెందిన బజాజ్ ఆటో ఫ్రీడమ్ 125 బైక్ను విడుదల చేసింది. కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్- సిఎన్జితో నడిచే ప్రపంచంలోనే మొట్టమొదటి బైక్ ఇదే. ఈ సీఎన్జీ బైక్ ధర 95 వేల రూపాయల నుంచి 1.10 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఈ బైక్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించారు.
బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ లో ఇంధనం కోసం రెండు ట్యాంకులను ఏర్పాటు చేశారు. బైక్ సీటు కింద రెండు లీటర్ల పెట్రోల్ ట్యాంక్, రెండు కిలోల సీఎన్జీ ట్యాంక్ ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ లో కిలో సీఎన్జీ ధర 60 రూపాయలు. ఒక కిలో సిఎన్జితో ఈ బైక్ 106 కిలో మీటర్ల దూరం ప్రయాణిస్తుంద బజాజ్ కంపెనీ తెలిపింది. భవిష్యత్తులో పెట్రోల్ ట్యాంకుల స్థానంలో ఇథనాల్ ట్యాంకులను ఏర్పాటు చేయాలని బజాజ్ ఆటోకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సూచించారు. పెట్రోల్ కంటే ఇథనాల్ పర్యావరణ అనుకూలమని ఆయన చెప్పారు.
సిఎన్జి పెట్రోలియం ఉత్పత్తి అయినప్పటికీ, పెట్రోల్, డీజిల్తో పోలిస్తే పర్యావరణానికి తక్కువ హానికరమని సంస్థ వివరించింది. బజాజ్ సీఎన్జీ బైక్ ఫ్రీడమ్ 125 ఆచరణలో ఎంత డబ్బు ఆదా చేయగలదో నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రస్తుత ధరల ప్రకారం పెట్రోల్ ద్విచక్రవాహనం కిలోమీటరుకు 2.25 రూపాయల ఖర్చు అవుతోంది. అదే ఈ బజాబ్ సీఎన్జీ బైక్ కిలోమీటరుకు ఒక్క రూపాయి మాత్రమే ఖర్చవుతోంది. బైక్ ధర కూడా పెట్రోల్ బైకులతో సమానంగానే ఉంది.