తెలంగాణకు కు ఐఎండీ రెయిన్ అలెర్ట్ జారీ చేసింది. రానున్న ఐదు రోజుల పాటు రాష్ట్రంలో ఓ మోస్తారు నుంచి భారీ, అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఆగ్నేయ, పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనంతో పాటు షియర్ జోన్ ఏర్పడిందని ఐఎండీ తెలిపింది. దీని ప్రభావంతోనే తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు అధికారులు.
రానున్న ఐదు రోజుల పాటు ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, ఖమ్మం, జనగాం, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండి. మరోవైపు ఈ నెల 18, 19 తేదీల్లో ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. సోమవారం హైదరాబాద్ లో కురిసిన వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది.