ఉత్తరాఖండ్ లో భారీ వర్షానికి కొండచరియల బీభత్సం
ఉత్తరాఖండ్ దేవ భూమిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు హైదరాబాద్ వాసులు దైవ దర్శనం కోసం వెళ్లి మృత్యువాతపడ్డారు. ఉత్తరాఖండ్ లో రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. జోరు వానలకు చాలా చోట్ల కొండ చరియలు విరిగిపడ్డాయి. కర్ణప్రయాగ, గౌచర్ మధ్యలోని బద్రీనాథ్ నేషనల్ హైవేపై శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. చమోలీ జిల్లాలో చోటుచేసుకున్న ఘటనలో హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యాత్రికులు చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
హైదరాబాద్కు చెందిన 36 ఏళ్ల నిర్మల్ షాహీ, 50 ఏళ్ల సత్య నారాయణ ఉత్తరాఖండ్ లోని బద్రీనాథ్ ఆలయాన్ని దర్శించుకుని బైక్ పై తిరిగొస్తుండగా భారీ వర్షం కురిసింది. మార్గమధ్యంలో వారిపై కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో వాళ్లిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారి మృత దేహాలను శిథిలాల నుంచి బయటకు తీసి పోస్ట్మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని పోలీసులు చెప్పారు. హైదరాబాద్ లోని మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.