అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడి ప్రభుత్వం మారడంతో.. అన్నీ బయట పడతాయన్నభయంతో హార్డ్ డిస్కులన్నింటినీ ధ్వంసం చేశారు. వాటి స్థానంలో కొత్త వాటిని పెట్టారు . కానీ ధ్వంసం చేసిన వాటిలో దేశ భద్రతకు సంబంధించిన అంశాలు కూడా ఉండటంతో సైబర్ టెర్రరిజం కేసులు పెట్టారు. ఇప్పటికే అరెస్టైన పోలీసులపై ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ ద్వారా అనేక చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్నాయి. అనేక మందిని బెదిరించి డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే ఇంత వరకూ పోలీసులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రభాకర్ రావు ఇంకా అందుబాటులోకి రాలేదని హైదరాబాద్ సీపీ తెలిపారు. ఆయన కోసం రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లుగా ప్రచారం జరుగుతోందని అలాంటిదేమీ లేదన్నారు.
ఆయన ఎక్కడున్నారో ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ కేసులో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని దర్యాప్తులో బయట పడే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతామన్నారు. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు దొరికే వరకూ ఈ నలుగురు నిందితులకు బెయిల్ రావడం కష్టమేనని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు. సైబర్ టెర్రరిజం లాంటి కఠినమైన సెక్షన్లను వీరిపై నమోదు చేయాలని నిర్ణయించడంతో వారికి మరిన్ని కష్టాలు రానున్నాయి. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందించిన కేసీఆర్ .. ఇంటర్ సెప్షన్ అనేది ఇంటలిజెన్స్ అధికారుల స్థాయిలో తీసుకునే నిర్ణయాలని ముఖ్యమంత్రితో సంబంధం ఉండదని ప్రకటించారు.