- టిఎస్ ఆర్టీసి ఎండితో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- పర్యావరణరహితమైన ప్రజా రవాణాపై చర్చ
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) ఎండి విసి సజ్జనార్, ఐపిఎస్, ఉన్నతాధికారులతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ భేటీ అయ్యారు. హైదరాబాద్లోని బస్భవన్లో గురువారం ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టిఎస్ ఆర్టీసిలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం, టెక్నికల్ సపోర్ట్, అప్ గ్రేడింగ్ స్కిల్స్, ట్రైనింగ్పై ప్రధానంగా చర్చించారు.
మొదటగా ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ బస్సులు, భవిష్యత్లో వాడకంలోకి వచ్చే ఎలక్ట్రిక్ బస్సుల గురించి పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా ఆర్టీసి ఉన్నతాధికారులు బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్కు వివరించారు. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ బస్సులను వినియోగిస్తున్నందుకు టిఎస్ ఆర్టీసికి గారెత్ విన్ ఓవెన్ అభినందనలు తెలియజేశారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవి) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆర్టీసి అధికారులతో సమావేశమయ్యామని గారెత్ విన్ ఓవెన్ చెప్పారు. గతేడాది గోవాలో జరిగిన జీ-20 సమావేశాల్లో యూకే, యూఎస్, భారతదేశంతో కుదిరిన ఒప్పందం మేరకు జెడ్ఈవిల ఫైనాన్సింగ్ మెకానిజం బలోపేతం చేస్తున్నామని గారెత్ విన్ ఓవెన్ వివరించారు. ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై ఆర్టీసి సిబ్బందికి వర్క్ షాపులు నిర్వహించి సాధికారికత కల్పిస్తామని ఆయన వివరించారు.
కాలుష్యరహిత అనుభూతిని అందించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు: ఎండి సజ్జనార్
కాలుష్యరహిత ప్రయాణ అనుభూతిని అందించేందుకు టిఎస్ ఆర్టీసిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని సంస్థ ఎండి విసి సజ్జనార్, ఐపిఎస్ అన్నారు. సంస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వ్యవస్థను మరింతగా విస్తృత పరిచేందుకు ఈ సమావేశం ఉపయోగపడుతుందని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో బ్రిటిష్ హైకమిషనర్ సీనియర్ అడ్వైజర్ జావైద్ మల్లా, రాష్ట్ర ప్రభుత్వ ఆటోమోటివ్ అండ్ ఈవీ సెక్టార్ డైరెక్టర్ గోపాల కృష్ణ, టిఎస్ ఆర్టీసి సీఓఓ డాక్టర్ రవీందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఐపిఎస్, డబ్ల్యూఆర్ఐ ఇండియా ప్రతినిధి చైతన్య కనూరి, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా డేవిస్ నుంచి అనన్య బెనర్జీ, తదితరులు పాల్గొన్నారు.