Monday, June 17, 2024

ఆరో విడత పోలింగ్​ ఓటేసిన ప్రముఖులు

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 లోక్‌సభ స్థానాలకు శనివారం ఉదయం నుంచి పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే తొలి గంటల్లో భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి తమ బాధ్యతను నెరవేర్చాలని పలువురు ప్రముఖులు పిలుపునిచ్చారు.
దేశ రాజధాని ఢిల్లీలోని ఒక పోలింగ్‌ కేంద్రంలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపదీ ముర్ము తన ఓటు వేశారు. రాష్ట్రపతి భవన్ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పింక్ బూత్‌కు వెళ్లి ఓటు వేశారు. రాష్ట్రపతి అయిన తర్వాత ద్రౌపదీ ముర్ము తొలిసారిగా లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేశారు. ఇక ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌, ఆయన సతీమణి సుదేశ్‌ క్యూలైన్‌లో నిల్చుని ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ తొలి గంటల్లో ఓటేశారు. అలాగే, పోలింగ్‌ ప్రారంభమైన వెంటనే ఉదయం 7 గంటలకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పోలింగ్‌ బూత్‌లో ఓటు వేసిన తొలి వ్యక్తి ఈయనే కావడంతో అధికారులు ఆయనకు సర్టిఫికేట్‌ కూడా ఇచ్చారు. గాంధీ కుటుంబం శనివారం ఢిల్లీలో ఓటు వేసింది. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రాలు న్యూఢిల్లీ స్థానంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేశారు. ఓటు వేసిన అనంతరం రాహుల్ గాంధీ కూడా తల్లి సోనియా గాంధీతో సెల్ఫీ దిగి పంచుకున్నారు. ప్రియాంక కుమార్తె మిరయా, కుమారుడు రేహాన్‌ వాద్రా క్యూలైన్‌లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. సోనియా, రాహుల్, ప్రియాంక ఓటు వేసిన స్థానం నుంచి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థికి బదులు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి సోమనాథ్ భారతికి ఓటేశారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బన్సూరి స్వరాజ్ బరిలో ఉన్నారు. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన కుటుంబంతో ఓటు వేశారు.

మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలో ఓటు వేశారు. తూర్పు ఢిల్లీ బీజేపీ అభ్యర్థి బన్సూరీ స్వరాజ్‌, ఆమె తండ్రి కౌశల్‌ స్వరాజ్‌ కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్రమంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పూరీ దంపతులు, పారిశ్రామికవేత్త నవీన్‌ జిందాల్‌ కుటుంబసభ్యులు, ఢిల్లీ మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, ఆతిశీ, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌, హర్యానా ముఖ్యమంత్రి నాయబ్‌ సింగ్‌ సైనీ, మాజీ ఎన్నికల ప్రధానాధికారి సుశీల్ చంద్ర తదితరులు తొలి గంటల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

చంద్రబాబు ప్రమాణ స్వీకార వేదికపై తమిళిసైకి అమిత్ షా వార్నింగ్ ఇచ్చారా...?

Most Popular