టీఎస్, న్యూస్: చింత చిగురు ధర వింటేనే నగరవాసుల గుండె గుభేలుమంటోంది. సాధారణంగా కిలో రూ.100-200 మధ్యలో లభ్యమయ్యే ఈ చిగురు ఏకంగా రూ.500 వరకు ధర పలుకుతుండడంతో బెంబేలెత్తుతున్నారు. రూ.300లోపు లభిస్తున్న కిలో చికెన్ ధరను మించి చిగురు ధర పలుకుతుండడం కలవర పెడుతున్నది. గ్రామాల్లో విరివిగా లభించే ఈ చిగురుకు నగరంలో ఈసారి కొరత ఏర్పడింది.
రైతుబజార్, ఇతర మార్కెట్లలోనే వీటి ధర మండిపోతున్నది. నాణ్యతను బట్టి కిలో చిగురును రూ.300నుంచి రూ.500వరకు విక్రయిస్తున్నారు. ధరల మోత మోగుతుండడంతో వినియోగదారులు 50 గ్రాముల నుంచి 100 గ్రాముల లోపు కొనుగోలు చేస్తున్నారు. కేపీహెచ్బీ రైతు బజార్లో 100 గ్రాములకు రూ. 30 నుంచి రూ.50 వరకు విక్రయిస్తున్నారు.