- ఒక్క డిసెంబర్లోనే 90 మంది మావోయిస్టులు హతం
- కేంద్ర హోం మంత్రి అమిత్ షా
టీఎస్, న్యూస్: చత్తీస్గఢ్లో కేంద్ర హోం మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వామపక్షాలు, నిషేదిత విప్లవ సంస్థల్లో హాట్ టాపిక్గా మారాయి. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. రెండేండ్లలో మావోయిస్ట్ పార్టీ ఉనికి లేకుండా చేస్తామంటూ షా ప్రకటించారు. దశాబ్దాల చరిత్రను పెనవేసుకున్న నక్సల్బరి ఉద్యమాన్ని పెకిలించివేస్తామంటూ చెప్పుకురావడం విప్లవ గ్రూపులు, వామపక్షా పంథా కలిగిన పార్టీల్లో కలకలం రేపుతున్నది. ఇప్పటికే మావోయిస్టులను ఏరివేశామంటూ అమిత్ షా చెప్పుకు వచ్చారు. ఛత్తీస్గఢ్లో 29 మంది మావోయిస్టులను హతమార్చిన ఆపరేషన్ తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. “ఆయుధాలు వదలండి లేదా హింసను వ్యాప్తి చేసినందుకు తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది” అంటూ హెచ్చరించారు. ఇప్పటికే నక్సల్స్ను ఏరివేశామని, అక్కడక్కడా మిగిలి ఉన్న నక్సలైట్లను లొంగిపోవాలని తాను కోరుతున్నాని, వాళ్లకు పునరావాసం కల్పిస్తామని అన్నారు. లేదంటే సాయుధ బలగాల చేతిలో చావు ఉంటుందని, వచ్చే రెండేండ్లలో పూర్తిగా నిర్మూలిస్తామంటూ హెచ్చరించారు. చత్తీస్గఢ్లోని కాంకేర్ జరిగిన ఎన్నికల ర్యాలీలో షా ఈ హెచ్చరికలు జారీ చేశారు.
రెండేండ్లలో అంతం
వచ్చే రెండేళ్లలో నక్సలిజం అంతం అవుతుందని అమిత్ షా హామీ ఇచ్చారు. విప్లవానికి కేంద్రంగా మారిన ఛత్తీస్గఢ్ను అభివృద్ధి చేయడానికి బీజేపీ చాలా కృషి చేసిందని చెప్పుకొచ్చారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు లొంగిపోవాలని, లేకుంటే రెండేళ్లలో రాష్ట్రం నుంచి తరిమికొడతామని తీవ్రవాదులకు హెచ్చరిక జారీ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించిందని అన్నారు. గత నాలుగు నెలల్లోనే బీజేపీ ప్రభుత్వ హయాంలో ఛత్తీస్గఢ్లో 90 మంది మావోయిస్టులు మట్టుబెట్టారని, ఏప్రిల్ 16న బస్తర్ ప్రాంతంలో భాగమైన కంకేర్లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు కాల్చిచంపారని అన్నారు.
నరేంద్ర మోడీ పాలనలో దేశం నుండి ఉగ్రవాదాన్ని నిర్మూలించారని, మావోయిజం నిర్మూలన అంచున ఉందని, భూపేష్ బఘేల్ ప్రభుత్వం మావోయిస్టులపై చర్యలు తీసుకోలేదు అని షా అన్నారు. డిసెంబరులో అధికారం చేపట్టిన తర్వాత మావోయిస్టుల తిరుగుబాటును ఎదుర్కోవడంలో రాష్ట్ర బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలు ఉన్నాయని, గత నాలుగు నెలల్లో రాష్ట్రంలో 90 మంది మావోయిస్టులను ఏరివేశామన్నారు. 123 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, మరో 250 మంది లొంగిపోయారని అమిత్ షా వివరించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో మావోయిస్టులను లేకుండా చేశామన్నారు. మోదీని మూడవసారి ఎన్నుకుంటే రెండు సంవత్సరాలలో ఛత్తీస్గఢ్ నుండి మావోయిజం ముప్పు తుడిచిపెట్టుకుపోతుంది అని వెల్లడించారు.