- అభ్యర్థుల తరపున నామినేషన్లు, సభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి
- పార్టీ కేడర్లో ఉత్సాహం నింపేలా రాష్ట్ర కాంగ్రెస్ వ్యూహాలు
రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే సిఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరపున నేటి నుంచి తన ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు. బహిరంగ సభలు, రోడ్డు షోలతో ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు సిఎం రేవంత్ సిద్ధం అయ్యారు. ముందుగా ఆయన నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని కేడర్ను ఉత్సాహపరచాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. పార్టీకి అనుకూల వాతావరణం ఉండడం, లోక్సభ నియోజకవర్గాల ఇన్చార్జీలంతా మంత్రులు, సీనియర్ నేతలు ఉండటంతో తనవంతు పాత్రగా ప్రచారంలో పాల్గొనాలని సిఎం రేవంత్ నిర్ణయించారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే లు కూడా తెలంగాణ ప్రచారంలో పాల్గొననున్నారు.
నేడు మహబూబ్నగర్, మహబూబాబాద్లో సిఎం…
అందులో భాగంగా నేడు ఉదయం మహబూబ్నగర్లో అభ్యర్థి వంశీచంద్రెడ్డి నామినేషన్ ర్యాలీలో
సిఎం పాల్గొని, కార్నర్ మీటింగ్లో మాట్లాడనున్నారు. నేడు సాయంత్రం మహబూబాబాద్లో జరిగే సభ కు సిఎం బయలుదేరి వెళ్లనున్నారు. ఇక నేటి నుంచి సిఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. ఈ నెల 20వ తేదీన మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమానికి సిఎం హాజరవుతారు. సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తారు.
ALSO READ: రాసిపెట్టుకోండి…. జూన్ 9వ తేదీన రాహుల్గాంధీ ప్రధానిగా ప్రమాణస్వీకారం..
ఈ నెల 21వ తేదీన చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో రేవంత్ పాల్గొంటారు. 22వతేదీ ఉదయం ఆదిలాబాద్లో నిర్వహించే కాంగ్రెస్ సభలో సిఎం పాల్గొంటారు. 23వ తేదీన నాగర్ కర్నూల్ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇక ఈ నెల 24వ తేదీ వరంగల్, 25వ తేదీన చేవెళ్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. మరోవైపు రేవంత్రెడ్డితోనూ దక్షిణాదితో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ప్రచారం చేయించేలా ఏఐసిసి ప్రణాళికలు రూపొందించింది. ఇందుకు అనుగుణంగా టిపిసిసి నేతలు షెడ్యూల్ను ఖరారు చేస్తున్నారు.
నియోజకవర్గాలకు చేరిన కరపత్రాలు, ఫ్లెక్సీలు
ఇప్పటికే ప్రకటించిన 14 లోకసభ స్థానాల అభ్యర్థులు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలతో సిఎం రేవంత్రెడ్డి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ప్రచారం నిర్వహణ, జాతీయ మేనిఫెస్టో, అయిదు గ్యారంటీలు, ప్రభుత్వ పథకాలు తదితర ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఆ మేరకు కరపత్రాలు, ఫ్లెక్సీలు, గోడ పత్రాలు లాంటివి ఇప్పటికే అసెంబ్లీ నియోజకవర్గాలకు చేరాయి.