- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా
- ఆదిలాబాద్ అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం
- ఆదిలాబాద్లో మూతపడిన సిసిఐ పరిశ్రమను తెరిపిస్తా
- ఆదిలాబాద్లో సిఎం రేవంత్ రెడ్డి
ఆదిలాబాద్ను సస్యశ్యామలం చేసేందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని సిఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. ఆదిలాబాద్ ఎంపి టికెట్ ఒక్కసారి కూడా మహిళకు దక్కలేదని, తొలిసారిగా ఆత్రం సుగుణకు ఆదిలాబాద్ ఎంపి టికెట్ దక్కిందని, ఆదిలాబాద్ అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని ఎలాగైనా ఆత్రం సుగుణను గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్లో మూతపడిన సిసిఐ పరిశ్రమను తెరిపిస్తామని రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. మోడీ, కెసిఆర్ పాలనకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ గడ్డపై నుంచే పోరు ప్రారంభించానన్నారు. గత పదేళ్లు కెసిఆర్ కుటుంబం దోచుకుంటే దేశంలోని సంపదను మోడీ, అదానీ, అంబానీలకు దోచిపెట్టారని ఆయన ఆరోపించారు. ఆదివారం ఆదిలాబాద్లో రాహుల్ గాంధీతో కలిసి సిఎం రేవంత్రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
9వ తేదీలోపు రైతు భరోసా, పంద్రాగస్టులోపు రూ.2 లక్షల రుణమాఫీ
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా పథకం పడటం లేదని కెసిఆర్ అంటున్నారని, ఇంద్రవెళ్లి అమరవీరుల సాక్షిగా ఈ నెల 9వ తేదీలోపు రైతు భరోసా, పంద్రాగస్టులోపు ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరతామని సిఎం రేవంత్ పునరుద్ఘాటించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో 5 అమలు చేసినట్లు ఆయన తెలిపారు. కేంద్రంలో ఉన్న బిజెపి తెలంగాణకు ఇచ్చింది గాడిద గుడ్డు అని, ఆ పార్టీకి అందరూ బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు.
విభజన హామీలు, ఇతర అభివృద్ధి పనులు చేయాలని కోరితే కేంద్రం గాడిద గుడ్డు చేతిలో పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. బలహీనవర్గాల గుండె చప్పుడు విన్న నేత రాహుల్ గాంధీ అని కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే అధికంగా కాంగ్రెస్కు పార్లమెంట్ స్థానాలను గెలిపించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.