- కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు
టీఎస్, న్యూస్: రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధిష్టానం ఆదేశిస్తే.. లోక్ సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీకి తాను సిద్ధంగా ఉన్నానని బాంబు పేల్చారు. సోమవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆమె ఖమ్మం ను పాలించడం వస్తే దేశాన్ని పాలించే అనుభవం వస్తుందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, నాయకత్వాన్ని విమర్శిస్తోన్న మాజీ సీఎం కేసీఆర్ కు డోస్ ఎక్కువైందనీ అందుకే ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని సెటైర్లు వేశారు. దేశంలో ప్రధాని మోడీ గ్యారంటీలకు వారంటీ అయిపోందన్న రేణుకా.. ఆయనకు ఓటమీ భయం పట్టుకుందని విమర్శించారు.
దేశంలో మతతత్వ రాజకీయాలకు తెరలేపిన మోడీ హయాంలో బీజేపీ సర్కార్.. హిందు, ముస్లీంల మద్య విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. హిందువులు పవిత్రంగా భావించే మంగళసూత్రంపై మోడీ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆమె ఖండించారు. హిందు మహిళల మంగళసూత్రాలను ముస్లిం మహిళలు తీసుకెళ్లిపోతారని ఏ ఉద్దేశంతో చెప్పారో అర్ధం కావడం లేదన్నారు. అసలు ముస్లిం మహిళలకు మంగళసూత్రాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటనీ ప్రశ్నించారు. తన మంగళసూత్రం తీసే దమ్ము ఎవరికీ లేదన్న ఆమె మోడీ చేసిన వ్యాఖ్యలను ఎన్నికల కమిషన్ సీరియస్ గా తీసుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దేశంలో మహిళలను అవమానపర్చిన మోడీపై ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని ఎదురుచూస్తున్నట్లు వివరించారు. అదానీ, నీరవ్ మోడీ లాంటి ఆర్ధిక నేరగాళ్లు చేసిన భారీ అప్పులను మాఫీ చేసిన మోడీ రైతుల రుణమాఫి విషయాన్ని విస్మరించారన్నారు. మోదీకి రాజ్యాంగం, దేశ చరిత్ర గురించి ఏ మాత్రం తెలియదన్నారు. టెర్రరిజం, విద్వేషం కేవలం ఒక మతానికి సంబంధించింది కాదన్న ఆమె.. విద్వేషాన్ని రెచ్చగొట్టే వాళ్లు అన్ని మతాల్లోనూ ఉంటారన్నారు. అంత మాత్రానా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని విషం కక్కడం సరికాదని చెప్పారు.