Thursday, May 2, 2024

ఎక్సైజ్ శాఖలో అవినీతి దందాపై విజిలెన్స్, ఏసిబి నజర్…!

  • 2017 నుంచి 2022 వరకు అందినకాడికి దండుకున్న 10 మంది అధికారులు
  • అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీకి 13 ఎకరాల భూమి గిఫ్ట్‌గా…
  • వారి సంపాదన నెలకు లక్షల్లో …
  • ప్రభుత్వానికి ఫిర్యాదుల వెల్లువ
  • విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
  • రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదికను అందచేయనున్న విజిలెన్స్

ఎక్సైజ్ శాఖలోని కొందరు అధికారుల అవినీతిపై విజిలెన్స్ శాఖతో పాటు ఏసిబి దృష్టి సారించింది. ప్రభుత్వానికి అందిన ఫిర్యాదుల మేరకు విజిలెన్స్, ఏసిబి శాఖలు ఎక్సైజ్ శాఖ అధికారుల అవినీతి చిట్టాను రూపొందించే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలోనే 2017 నుంచి 2022 వరకు జరిగిన అవినీతిపై ఈ రెండు శాఖలు నజర్ పెట్టాయి. అందులో భాగంగా ఈ ఐదేళ్ల కాలంలో 10 మంది అధికారులు చేసిన అవినీతికి సంబంధించి పూర్తి స్థాయి నివేదికను విజిలెన్స్ శాఖ తయారు చేసినట్టుగా సమాచారం.

ఈ నివేదికను రెండు, మూడురోజుల్లో ప్రభుత్వానికి అందజేయనున్నట్టుగా తెలిసింది. అయితే ఈ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూసినట్టుగా తెలిసింది. 2017 నుంచి 2022 సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు అన్నీ తానై వ్యవహారించిన ఓ ఐఏఎస్ అధికారికి తమ గురుభక్తిని చాటుకోవడానికి కొందరు అధికారులు 13 ఎకరాల వ్యవసాయ భూమిని సైతం గిఫ్ట్‌గా ఇచ్చినట్టుగా తెలిసింది. ఆయన ఆ శాఖకు ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహారించడంతో ఈ ఐదు సంవత్సరాల కాలంలో 10 మంది అధికారులు తమకు అప్పగించిన బాధ్యతలను మరిచి ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మును అందినకాడికి దండుకున్నట్టుగా విజిలెన్స్ విచారణలో తేలింది.

గిఫ్ట్‌గా 13 ఎకరాల వ్యవసాయ భూమి
ఈ ఐదేళ్ల కాలంలో ఆ ఉన్నతాధికారి ఎక్సైజ్ శాఖలో ఎలాంటి పదోన్నతులు కల్పించకుండా పలువురు అధికారులతో ఈ అవినీతి దందాకు పాల్పడినట్టుగా తేలింది. ఈ ఐదు సంవత్సరాల కాలంలో చాలామందికి పదోన్నతులు రాకపోవడంతో వారంతా పదవీ విరమణ అలాగే చేయాల్సి రావడం ఈ ఉన్నతాధికారి వల్లేనని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఇలా తనకు నచ్చిన వారికి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి మూడు, నాలుగు బాధ్యతలను అప్పగించి అందినకాడికి దండుకున్నట్టుగా విజిలెన్స్ విచారణలో తేలడం విశేషం. ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ అధికారులంతా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి నమ్మినబంటుగా ఉండడంతో పాటు అందినకాడికి వసూళ్లు చేసినట్టుగా సమాచారం. ఈ వసూళ్లలో భాగంగా ఒక్కో అధికారి ప్రతినెలా రూ.50 నుంచి రూ.70 లక్షలను వసూళ్లకు పాల్పడినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి 13 ఎకరాల వ్యవసాయ భూమిని సైతం ఈ అధికారులు గిఫ్ట్‌గా ఇప్పించినట్టుగా సమాచారం.

అప్పుడు, ఇప్పుడు అన్నీ తానై….
ఈ అధికారి అప్పుడు, ఇప్పుడు అన్నీ తానై ఈ శాఖను ముందుకు నడిపిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 2017 నుంచి 2022 వరకు ఈ అధికారి డైరెక్టర్‌గా, అడిషనల్ కమిషనర్‌గా, జెసి ఎన్‌ఫోర్స్‌మెంట్ (డిస్టలరీ), అకాడమీ డైరెక్టర్‌గా విధులు నిర్వహించగా ఆయన ఆదాయం నెలకు రూ.50 నుంచి రూ.70 లక్షల దాకా ఉన్నట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. దీంతోపాటు 19 డిపోల నుంచి నెలకు రూ.2 నుంచి రూ.3లక్షలను వసూలు చేసి వాటిని ఉన్నతాధికారులకు పంచినట్టుగా తెలిసింది.

ఆయనకు 5 బాధ్యతలు…రూ.45 లక్షల ఆదాయం
ఈ అధికారి అప్పట్లో ఐదు బాధ్యతలను నిర్వర్తించారు. అందులో ఖమ్మం జిల్లా డిసిగా, అదే జిల్లా ఎసిగా, నల్లగొండ (ఎసిగా), రంగారెడ్డి (ఎసిగా), నల్లగొండ (డిసి)గా ఆయన 5 బాధ్యతలను నిర్వర్తించగా ఆయన నెల ఆదాయం రూ.45 లక్షలుగా ఉందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు.

ఈ అధికారికి రెండు బాధ్యతలు
మరో అధికారి రెండు బాధ్యతలను నిర్వర్తించారు. ఆయన ఆదాయం నెలకు రూ.40 లక్షల వరకు ఉన్నట్టుగా సమాచారం. అప్పుడు ఆయన మహబూబ్‌నగర్ డిసి, రంగారెడ్డి డిసిగా బాధ్యతలను నిర్వర్తించారు.

మూడు పదవులు…రూ.20 లక్షల ఆదాయం
ఈ అధికారి సికింద్రాబాద్ ఈఎస్‌గా, హైదరాబాద్ ఈఎస్‌గా, డిడి వింగ్‌లకు ఇన్‌చార్జీ బాధ్యతలను నిర్వర్తించగా ఈయన ఆదాయం నెలకు రూ.20 లక్షలని విచారణలో బయటపడింది.

అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీకి అతి సన్నిహితంగా….
ఈ అధికారి అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీకి అతి సన్నిహితంగా మెలగడంతో పాటు పలు అవినీతి దందాలకు పాల్పడినట్టుగా విజిలెన్స్ విచారణలో తేలింది. అప్పుడు ఆయన 5 బాధ్యతలను నిర్వర్తించగా అందులో ఎస్టీఎఫ్ (ఎసి)గా, అడ్మిన్ (ఎసి)గా, డిస్టలరీ (ఎసి)గా, డిస్టలరీ (జెసి)గా విధులను నిర్వర్తించడంతో పాటు ఆయన ఆదాయం రూ.60 నుంచి రూ.70 లక్షలని తేలింది.

నాలుగు బాధ్యతలు…రూ.30 లక్షలు
ఈ అధికారి కూడా అవినీతి సొమ్మును 5 ఏళ్లలో బాగా వెనుకేసుకున్నట్టుగా విజిలెన్స్ విచారణలో తేలింది. ఆ సమయంలో ఈ అధికారి నాలుగు బాధ్యతలను నిర్వర్తించి నెలకు రూ.30 లక్షల వరకు వెనుకేసుకున్నట్టుగా సమాచారం. నిజామాబాద్ (డిసి)గా, నిజామాబాద్ (ఎసి)గా, ఆదిలాబాద్ (డిసి)గా, ఆదిలాబాద్ (ఎసి)గా ఆయన విధులను నిర్వర్తించారు.

ఈయనకు మూడు జిల్లాలో అదనపు బాధ్యతలు
ఈ అధికారి మూడు జిల్లాలో అదనపు బాధ్యతలను నిర్వర్తించారు. అందుకు ఆయనకు ప్రతిఫలంగా నెలకు రూ.45 లక్షలను అక్రమంగా సంపాదించారు. సంగారెడ్డి (ఈఎస్‌గా) మహబూబ్‌నగర్ ఇన్‌చార్జీ (ఎసి)గా, నాగర్‌కర్నూల్ (ఈఎస్)గా, ప్రధాన కార్యాలయంలో అడ్మిన్ (ఎసి)గా ఆయన బాధ్యతలను నిర్వర్తించారు.

7 బాధ్యతలు…రూ.50 లక్షల ఆదాయం
ఈ అధికారి కూడా మూడు జిల్లాలో 7 అదనపు బాధ్యతలను నిర్వర్తించి అందినకాడికి దండుకోవడం విశేషం. మహబూబ్‌నగర్ (ఏఈఎస్)గా, మహబూబ్‌నగర్ (ఈఎస్)గా, గద్వాల (ఈఎస్)గా, వనపర్తి (ఈఎస్)గా, వనపర్తి (ఏఈఎస్)గా, నారాయణపేట్ (ఈఎస్)గా, మహబూబ్‌నగర్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఏఈఎస్)గా ఆయన విధులను నిర్వర్తించారు. ప్రతినెల రూ.40 నుంచి రూ.50 లక్షల వరకు వెనుకేసుకున్నట్టు విజిలెన్స్ గుర్తించింది.

డ్రగ్స్ కేసులో కోట్లలో వసూళ్లు
ఈ అధికారి కూడా ఆ ప్రిన్సిపల్ సెక్రటరీకి ముఖ్య అనుచరుడని విచారణలో తేలింది. ఆ సమయంలో ఈ అధికారి హైదరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఏఈఎస్)గా, హైదరాబాద్ (ఎసి)గా, ధూల్‌పేట్ (ఏఈఎస్)గా, సిట్ (ఇన్‌చార్జీ)గా పనిచేశారు. ఆయన ఆదాయం నెలకు రూ.50 నుంచి 70 లక్షల వరకు ఉన్నట్టుగా సమాచారం. దీంతోపాటు ఈయన డ్రగ్స్ కేసు విచారణకు సంబంధించి కోట్లలో వసూలు చేసినట్టుగా విచారణలో తేలింది. ప్రస్తుతం ఈ అధికారికి ఇద్దరు నమ్మకస్తులైన కానిస్టేబుల్స్ అన్నీ తామై వ్యవహారిస్తున్నట్టుగా విజిలెన్స్ గుర్తించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular