టీఎస్, న్యూస్:కేంద్ర హోంమంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హైదరాబాద్ చేరుకున్న ఢిల్లీ పోలీసులు నిందితుల ఆచూకీ కోసం ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకుని సీసీఎస్ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో మన్నే సతీష్, అస్మా, తస్లీమా, గీత, శివ ఉన్నారు. మరోవైపు, ఈ కేసులో ఇప్పటికే ఏడుగురికి ఢిల్లీ పోలీసులు నోటీసులు అందజేశారు. అలాగే 6 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. బీజేపీ నేత ప్రేమేంధర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్లో కేసు నమోదు అయ్యింది. రెండు సెక్షన్స్ 469, 505 కింద సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. టీపీసీసీ ట్విట్టర్ ఖాతా ఆధారంగా హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఇటీవల ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారని అమిత్ షా పేరుతో ఓ ఫేక్ వీడియోను కాంగ్రెస్ పార్టీ వైరల్ చేసింది. ఫేక్ వీడియోపై కేంద్ర హోం శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 153/153A/465/469/171G కింద ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించారన్న వివాదం నేపథ్యంలో ‘డీప్ఫేక్’ వీడియోలపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేస్తున్నందున డీప్ఫేక్ వీడియోల వ్యాప్తిని, ప్రసారాన్ని అరికట్టేలా ఎన్నికల కమిషన్ను ఆదేశించాలని న్యాయవాదుల బృందం ఈ పిల్లో కోరింది.