మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
టీఎస్, న్యూస్: 20మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు, ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశా నిర్దేశం చేశారు. అంతకుముందు తెలంగాణ తల్లి విగ్రహానికి కేసీఆర్ నివాళులర్పించారు. 17మంది లోక్సభ అభ్యర్థులు, కంటోన్మెంట్ అభ్యర్థి నివేదితకు బీఫామ్లు అందజేశారు. అలాగే ఎన్నికల ఖర్చుల కోసం ఒక్కో ఎంపీ అభ్యర్థికి రూ.95 లక్షల చెక్కులను గులాబీ బాస్ అందజేశారు.
ఈ సందర్భంగా సమావేశంలో కేసీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. ఏడాది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గందరగోళంలో పడుతుందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుర్మార్గుడని మండిపడ్డారు. గతంలో 111మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశారని అన్నారు. అప్పుడు మన ఎమ్మెల్యేలను కొనాలని చూసిన వాళ్లను దొరక బట్టామని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోదీ కూల్చకుండా ఉంచుతాడా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్రెడ్డి బీజేపీలోకి వెళ్తాడని తాను అనుకోనని కీలక వ్యాఖ్యలు చేశారు.
లిక్కర్ కేసు ఉత్తిదే
ఒకవేళ రేవంత్ బీజేపీలోకి వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెళ్లే పరిస్థితి ఉండదన్నారు. లిక్కర్ కేసు అంతా ఉత్తిదేనని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ను అరెస్ట్ చేయడానికి మనం పోలీస్లను పంపించామని…అప్పటి నుంచి మోదీ మన మీద కక్ష కట్టారని విరుచుకుపడ్డారు. అందుకే తన కూతరు కవితను అరెస్ట్ చేసి జైల్కు పంపించాడని ధ్వజమెత్తారు. ఈ నెల 22వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్ర చేద్దామని క్యాడర్కు తెలిపారు. ఎక్కడెక్కడ బస్సుయాత్ర చేయాలో నియోజకవర్గాల వారిగా రూట్మ్యాప్ ఇవ్వాలని సూచించారు. అవసరమైతే తాను వచ్చి జిల్లాల్లోనే ఉంటానని స్పష్టం చేశారు.సిద్దిపేట, మహబూబ్నగర్ లాంటి చోట భారీ బహిరంగ సభలు కూడా నిర్వహిద్దామని కేసీఆర్ సూచించారు.
22 నుంచి సభలు
ఈనెల 22వ తేదీ నుంచి రోడ్డు షోలు ప్రారంభమవుతాయన్నారు. కీలకమైన స్థానాలు వరంగల్ , ఖమ్మం.. మహబూబ్ నగర్ సెంటర్లలో భారీ బహిరంగ సభలు నిర్వహించేలా ప్లాన్ చేస్తామని ప్రకటించారు. ఒక్కో లోక్ సభ నియోజక వర్గం పరధిలోని రెండు, మూడు అసెంబ్లీ ఏరియాల్లో రోడ్డు షోలు ఉంటాయని వెల్లడించారు.
రోజుకు రెండు, మూడు రోడ్డు షోలు ఉంటాయని వ్యాఖ్యానించారు. సాయంత్రం వేళల్లో రోడ్డు షోలు..కార్నర్ మీటింగ్లు ఉండేలా ప్లాన్ చేద్దామని తెలిపారు. ఉదయం రైతుల వద్దకు వెళ్లి పరామర్శించి వారికి ధైర్యం చెబుదామని చెప్పారు. రైతు సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతామని కేసీఆర్ పేర్కొన్నారు.