టీఎస్, న్యూస్: రాష్ట్రంలో కాంగ్రెస్, కమ్యూనిస్టుల స్నేహబంధం బలపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకున్న సీపీఐ..లోక్ సభ ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు తెలిపింది. ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 19 స్ధానాల్లో ఒంటరిగా బరిలో దిగిన సీపీఎం ఈ ఎన్నికల్లో కేవలం ఒక్క భువనగిరి నుంచే పోటీకి సిద్ధమైంది. అలాగే పోటీ చేసే స్ధానం మినహా మిగిలిన అన్ని చోట్లా కాంగ్రెస్ గెలుపునకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే ఇండియా కూటమీలో భాగస్వాములైన ఆయా పార్టీలు కలిసి పోటీ చేయడం రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలను పెంచుతోంది.
మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సైతం.. కాంగ్రెస్ కు కమ్యూనిస్టులకు దోస్తీ కుదిరిందంటూ సోమవారం ట్విట్ చేశారు. కామ్రెడ్లతో కలిసి రాష్ట్రంలో తాను లక్ష్యంగా నిర్దేశించుకున్న స్ధానాల్లో గెలుపు బావుటా ఎగురవేస్తామంటూ అందులో ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులతో భేటీ అయిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లోక్ సభ ఎన్నికల్లో వారి మద్దతు కోరడం.. దానికి ఆయా నేతలు సముఖత వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ పూర్తి గెలుపు ధీమాతో ఉంది.