Sunday, May 19, 2024

ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ముదిరిన పంచాయితీ..?

  • తాజాగా ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు నోటీసులు
  • వారం రోజుల్లో రూ.54.53 కోట్ల జీఎస్టీని చెల్లించాలని ఆదేశం

వ్యాట్, జీఎస్టీల చెల్లింపుల విషయంలో ఎక్సైజ్ శాఖ, వాణిజ్య పన్నుల శాఖల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. పన్నుల చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేయడంతో ఈ వివాదం మరింత ముదిరిందని రెండు శాఖల ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు శాఖల మధ్య వ్యాట్, జీఎస్టీ చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదాన్ని పరిష్కరించేలా చేసేందుకు ఈ రెండు శాఖలను పర్యవేక్షిస్తున్న ముఖ్య కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి పలుమార్లు పంచాయితీ చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని ఉద్యోగులు వాపోతున్నారు. కొన్ని రోజులుగా ఆబ్కారీ శాఖ మీద వచ్చిన అభియోగాల నేపథ్యంలో వాణిజ్య పన్నుల శాఖ సోదాలు చేయడం, షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఈ రెండు శాఖల మధ్య వివాదం రోజు రోజుకు పెరుగుతోంది. తాజాగా హాలోగ్రామ్‌ల అమ్మకాలపై రూ. 54 కోట్లపైగా జీఎస్టీ చెల్లించాలని ఆబ్కారీ శాఖకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు రెండు శాఖల మధ్య అంతరం మరింత పెరిగింది. మద్యం, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై వస్తున్న వ్యాట్ ఆశించిన మేరకు రావడం లేదు.

హాలోగ్రామ్‌ల తయారీ, పంపిణీ సంస్థపై కమర్షియల్ ట్యాక్స్ దాడులు
ప్రతి ఏడాది అటు మద్యం, ఇటు పెట్రోల్, డీజిల్ వాడకం పెరుగుతూ వస్తోంది. దానికి తగినట్లు వ్యాట్ రాబడులు కూడా పెరగాల్సి ఉంది. కానీ, అది జరగడం లేదని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది. గతంలో ప్రతి ఏడాది కనీసం పది శాతం, అంతకన్నా ఎక్కువ ఆదాయం పెరుగుతూ వచ్చి 2023-,24 ఆర్థిక సంవత్సరంలో అత్యల్పంగా పెరగడంతో వాణిజ్య పన్నుల శాఖలో అనుమానాలు రావడంతో వ్యాట్, జీఎస్టీ రాబడులకు సంబంధించి అధికారులతో ఆ శాఖ ఉన్నతాధికారులు సమీక్ష చేశారు. మద్యం, పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై రావాల్సిన వ్యాట్ ఆశించిన మేర లేదని ఉన్నతాధికారులు గుర్తించారు. వాడకం పెరిగినా తగిన విధంగా రాబడి పెరగలేదని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.దీంతో ఎక్సైజ్ అకాడమీలో కొనసాగుతున్న హాలోగ్రామ్‌ల తయారీ, పంపిణీ సంస్థపై వాణిజ్య పన్నుల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.

జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటికీ హాలోగ్రామ్ అమ్మకంపై పన్ను చెల్లించలేదని….
అయితే, జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటికీ హాలోగ్రామ్ అమ్మకంపై పన్ను చెల్లించడం లేదని తేల్చిన వాణిజ్య పన్నుల శాఖ, అబ్కారీ శాఖ కమిషనర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మద్యం బాటిళ్లపై వేసే హాలోగ్రామ్‌లను డిస్టిలరీలు, బ్రీవరీలకు, డిపోలకు చేసిన అమ్మకాలపై జీఎస్టీ చెల్లించాలంటూ ఎక్సైజ్ శాఖకు వాణిజ్య పన్నుల శాఖ ఏప్రిల్ 25వ తేదీన షోకాజ్ నోటీసు ఇచ్చింది. హాలోగ్రామ్ అమ్మకాలపై 18 శాతం లెక్కన జీఎస్టీ చెల్లించాలని ఆ నోటీసులో వాణిజ్య పన్నుల శాఖ స్పష్టం చేసింది. 2017-, 18 నుంచి 2023-, 24 వరకు అమ్మిన రూ.302.98 కోట్ల విలువైన వెయ్యి కోట్లకుపైగా హాలోగ్రామ్‌లపై రూ.54.53 కోట్ల జీఎస్టీ చెల్లించాలని వాణిజ్య పన్నుల శాఖ నోటీసులో పేర్కొంది.

ఒక్కో హాలోగ్రామ్ 30పైసలు
ఒక్కో హాలోగ్రామ్ 30పైసలు లెక్కన అమ్మకాలు చేసినట్లు ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు ఇచ్చిన నోటీసులో వాణిజ్య పన్నుల శాఖ పేర్కొంది. వారం రోజుల లోపల నిర్ధేశించిన జీఎస్టీ చెల్లించకుంటే చర్యలు తీసుకుంటామని వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఆ నోటీసులో స్పష్టం చేశారు. తాజాగా ఎక్సైజ్ శాఖ కమిషనర్‌కు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో ఆ రెండు శాఖలకు చెందిన ఉన్నతాధికారుల మధ్య అంతరం మరింత పెరిగింది.

వాస్తవానికి నోటీసుల్లో పేర్కొన్నట్లు వాణిజ్య పన్నుల శాఖకు ఎక్సైజ్ శాఖ రూ.54.53 కోట్ల జీఎస్టీ చెల్లించినట్లయితే అందులో సగం రూ.27 కోట్లు కేంద్ర జీఎస్టీ కింద కేంద్రానికి పోతుంది. దీంతో వాణిజ్య పన్నుల శాఖ ఇచ్చిన నోటీసు కారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు రూ.27 కోట్లు నష్టం వాటిల్లుతుందని వాణిజ్య పన్ను శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు చిల్లు పడకుండా ముందుకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఈ పంచాయితీ ఎంతవరకు దారితీస్తుందోనని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular