Monday, May 13, 2024

బీఆర్​ఎస్​కు విరాళాలు అందుకేనా?

  • క్విడ్ ప్రోకో
  • బీఆర్​ఎస్​కు విరాళాలు అందకేనా..?
  • గులాబీ పార్టీకి రూ. 1322 కోట్లు
  • జాబితాలో మెఘాదే తొలి స్థానం
  • రూ. 28.75 కోట్లు ఇచ్చిందెవరు?

టీఎస్​, న్యూస్​:
ఎలక్టోరల్ బాండ్ల విరాళాల్లో బీఆర్ఎస్​కు భారీ విరాళాలు వచ్చాయి. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఎలక్టోరల్​ బాండ్ల వ్యవహారంలో దాతల పేర్లు బయటికి వచ్చాయి. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు ఇచ్చిన విరాళాల జాబితా ఎలా ఉన్నా.. రాష్ట్రంలో మాత్రం బీఆర్ఎస్ కు మొత్తం రూ. 1,322 కోట్లు బాండ్ల రూపంలో వచ్చాయి. బీఆర్ఎస్ కు డొనేషన్లు ఇచ్చన వారిలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ రెండు దఫాలుగా రూ. 195 కోట్లను విరాళంగా అందించింది. ఇక, రాష్ట్రంలోని ఫార్మా కంపెనీలు కూడా అప్పటి అధికార పార్టీపై కనకవర్షాన్ని కురిపించాయి. ప్రధానంగా ఎన్నికలకు ముందు కోట్ల రూపాయలను విరాళాలుగా ఇచ్చారు. ఫార్మా కంపెనీలది పెద్దవాటా అయితే.. ఆ తర్వాత రియల్​ ఎస్టేట్​ కంపెనీలు నిలిచాయి. అయితే, భారీస్థాయిలో విరాళాలు ఇచ్చిన కంపెనీలకు అప్పటి అధికార పార్టీ నుంచి ఏదో ఒక రూపంలో ప్రయోజనం కల్గిందనే అంశం ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. భూముల కేటాయింపులు, పదవులు, కంపెనీలకు రాయితీలు.. ఇలా ప్రభుత్వం నుంచి సాయాన్ని తీసుకున్న కంపెనీలు.. ఎలక్టోరల్​ బాండ్ల రూపంలో అప్పటి అధికార పార్టీకి విరాళాలు ఇచ్చారు.

28.75 కోట్లు ఎవరిచ్చారు
ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో దాతల పేర్లు బయటికి వచ్చాయి. బీఆర్ఎస్ కు మొత్తం రూ. 1,322 కోట్లు బాండ్ల రూపంలో వచ్చాయి. బీఆర్ఎస్ కు డొనేషన్లు ఇచ్చన వారిలో మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ కంపెనీ రెండు దఫాలుగా 195 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది. ఓ అనౌన్ డోనర్ 28.75 కోట్ల రూపాయలను బీఆర్ఎస్ కు అందించడం చర్చనీయాంశంగా మారింది. జాబితాలో అందరి పేర్లు కనిపిస్తున్నారు.. ఏడో నంబర్ గడిలో అనౌన్ డోనర్.. బ్రాకెట్లో నాట్ అవైలబుల్ అని ఉంది. ఇంతకూ ఎవరా అనౌన్ డోనర్ అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేసీఆర్ హయాంలో నిర్మితమైన కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కాంట్రాక్టుల్లో మేఘా సంస్థ పనులు చేసింది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు సైతం మేఘా కంపెనీకే దక్కడం గమనార్హం. ఈ సంస్థ 195 కోట్ల సమర్పించుకోవడం విశేషం. ఆ తర్వాత స్థానంలో ఫార్మా కంపెనీలు నిలిచాయి. హెటిరో డ్రగ్స్ నుంచి రెండు దఫాలుగా యాభై కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. అయితే ఈ సంస్థ ఎండీకి రాజ్యసభ ఎంపీ పదవి దక్కడం గమనార్హం. మూడో స్థానంలో రియల్ ఎస్టేట్ సంస్థలు ముందున్నాయి. ఇందులో ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి సమీప బంధువుకు సంబంధించిన రాజ్ పుష్ప ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంది. ఈ సంస్థ బీఆర్ఎస్ పార్టీకి రూ. 20 కోట్లు బాండ్ల రూపంలో సమర్పించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూడు దఫాలుగా బీఆర్ఎస్ పార్టీకి వెయ్యి కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో రావడం విశేషం. కరోనా కష్టసమయంలో రెట్టింపు ధరలకు మందులు, ఇంజక్షన్లు అమ్ముకున్న సంస్థలన్నీ అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీకి నిధుల వరద పారించినట్టు తెలుస్తోంది. ప్రతి ఉప ఎన్నికకు ముందు గులాబీ పార్టీకి విరాళాల రూపంలో భారీగా నిధులు వచ్చాయి. 2021లో దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు ముందు రూ.85 కోట్లు బాండ్లుగా వచ్చాయి. 2022లో మునుగోడు ఉప ఎన్నికలకు ముందు 92 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఒకే రోజు 663 కోట్ల రూపాయలు బాండ్ల రూపంలో రావడం గమనార్హం.

భూమి తీసుకున్న సంస్థ కూడా..!
బీఆర్‌ఎస్‌కు ఎక్కువగా విరాళం ఇచ్చిన మరో కంపెనీ కిటెక్స్. కాకతీయ టెక్స్‌టైల్ పార్కు కోసం రైతుల నుంచి సేకరించిన 187 ఎకరాల భూమిని కేటాయించారు. కేరళకు చెందిన టెక్స్‌టైల్ గ్రూప్ కిటెక్స్ కంపెనీ నవంబర్ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్​కు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా రూ.25 కోట్లు విరాళంగా ఇచ్చింది. రాష్ట్రంలోని వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట్ హవేలిలో రైతులు నిరసనలు తెలిపినప్పటికీ కిటెక్స్‌కు 187 ఎకరాల భూమిని కేటాయించారు. ఇక్కడ ప్రభుత్వం 731 కుటుంబాల నుంచి 1,190 ఎకరాల భూమిని సేకరించి, వారికి రూ.88 కోట్ల పరిహారం ఇచ్చింది. ముందుగా కిటెక్స్​కు 187 ఎకరాలు కేటాయించిన తరువాత, కిటెక్స్ దాని కాంపౌండ్ వాల్‌ను వాస్తుకు అనుగుణంగా మార్చడానికి అదనంగా 13.2 ఎకరాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దీనికి కూడా అప్పటి ప్రభుత్వం వెనకాడలేదు. రైతుల నుంచి వ్యతిరేకత వచ్చినా రెవెన్యూ అధికారులు భూములను సర్వే చేశారు. మార్కెట్‌లో ఎకరం రూ.50 లక్షలు ఉన్నప్పటికీ పరిహారం కింద ఎకరాకు రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చారని రైతులు రోడ్డెక్కారు. వరంగల్‌లోని కాకతీయ అపెరల్‌ పార్క్‌లో కాకుండా రంగారెడ్డిలో మరో ఫ్యాక్టరీకి కూడా భూమి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే కిటెక్స్ చిల్డ్రన్‌వేర్ రూ.9 కోట్లు విరాళం అందించగా, కిటెక్స్ గార్మెంట్స్ రూ.16 కోట్లు విరాళంగా ఇచ్చినట్లుగా వెల్లడవుతున్నది.

క్విడ్ ప్రోకో జరిగిందా..?
ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంలో భారీగా డబ్బును విరాళంగా ఇచ్చిన సంస్థలకు గులాబీ పార్టీ ఎలాంటి మేలు చేసి ఉంటుంది..? సదరు సంస్థ వ్యాపారాలేంటి..? అన్న అంశాలు చర్చకు వస్తున్నాయి. విరాళాలు అందించి తమ పనులను చేయించుకున్నారా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక భాగస్వామిగా ఉన్న మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్టక్చర్ కంపెనీ రెండు దఫాలుగా 195 కోట్ల రూపాయలను బాండ్ల రూపంలో ఇవ్వడం గమనార్హం. కరోనా కష్టకాలంలో ప్రజలపై పెనుభారం మోపుతూ ఇష్టం వచ్చిన ధరలకు రెమిడెసివిర్ ఇంజక్షన్లు అమ్మకున్న సంస్థలు కూడా అప్పటి అధికార పార్టీకి భారీగానే విరాళాలు అందించాయని తెలుస్తోంది. జవహర్ లాల్ నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు ను 30 సంవత్సరాలపాటు లీజుకు తీసుకున్న ఆర్బీఐ ఇన్ ఫ్రా కంపెనీ రూ. 25 కోట్ల రూపాయలను విరాళంగా అందించింది. ఇవన్నీ చూస్తుంటే భారీ ఎత్తున క్విడ్ ప్రోకో జరిగిందా..? అన్నది హాట్ టాపిక్ గా మారింది.

ఎన్నికల వేళ డబ్బుల వరద
ప్రతి ఎన్నికల సమయంలో గులాబీ పార్టీకి నిధులు వరదలా వచ్చాయి. ఇవన్నీ బాండ్ల రూపంలో వచ్చినవే. 2018 నుంచి 2023 వరకు మూడు ఉప ఎన్నికలు జరిగాయి. 2021లో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రాంలింగారెడ్డి మరణంలో అక్కడ ఉప ఎన్నిక వచ్చింది. అదే ఏడాది ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఉప ఎన్నిక జరిగింది ఈ రెండు ఉప ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో 85 కోట్ల రూపాయలు రావడం గమనార్హం. 2022లో మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ కూడా ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి రూ. 92 కోట్లు విరాళంగా వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 881 కోట్ల రూపాయలు అధికార పార్టీకి విరాళంగా వచ్చాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular