Friday, May 17, 2024

హైదరాబాద్‌లో అత్యంత సంపన్నుడు

ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌లోని మురళీ దివికి చోటు

పదివేల రూపాయిల ప్రభుత్వ ఉద్యోగి పెన్షన్‌తో గడుస్తున్న కుటుంబం. 14 మంది కుటుంబసభ్యులు. అందులో ఒక పిల్లాడు. అతని ఆశయాలు చాలా గొప్పవి కానీ వాటిని సాధించే పరిస్థితులు మాత్రం అంతంతమాత్రమే. మచిలీపట్నంలో ఇంటర్‌‌ సెకెండియర్ రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు.. అయినా ఏదో సాధించాలన్న అతని తపన.. ఆ తర్వాత మణిపాల్ హైయర్ స్టడీస్ కాలేజీలో చేరి బీఎస్సి చదివాడు. అదే అతని జీవితంలో అనుకోని మలుపుకి దారితీసింది. ఇంటర్ రెండుసార్లు ఫెయిల్ అయిన అదే కుర్రాడు నేడు అపరకోటీశ్వరుడిగా నెలకొనడానికి పునాది వేసింది. అతనెవరో చూడండి..

ఆంధ్రప్రదేశ్‌లో ఓ చిన్న టౌన్‌కు చెందిన మురళీ దివి.. నేడు ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్‌లోనే అత్యంత కోటీశ్వరుడిగా నిలిచారు. 53 వేల కోట్ల ఆస్తితో మురళీ దివి భారతీయులు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. ఒకరోజులో, ఒక ఏడాదిలో జరిగిన పరిణామం కాదిది. నలభై ఏళ్ళ సుదీర్ఘ శ్రమతో ఏర్పడిన సామ్రజ్యం. అదే‌‌.. దివీస్ ల్యాబ్స్.

చిన్నప్పుడు పెద్దగా చదువు ఒంటబట్టని మురళీ.. ఒకానొక సందర్భంలో అతని అన్నలాగే తను కూడా బీఎస్సీ చదవాలని నిశ్చయించి మణిపాల్ కాలేజీలు చేరాడు. అప్పటికే పద్నాలుగు మంది సభ్యులున్న కుటుంబం వారిది‌. వాళ్ళ నాన్నగారు ప్రభుత్వోద్యోగి. పదివేల పెన్షన్‌. ఆ డబ్బుతోనే కుటుంబం గడవాలి. ఆ డబ్బుతోనే నెట్టుకుని వచ్చారు.

డిగ్రీ అయిన తర్వాత మురళి ఓ సంస్థలో ఫార్మసిస్ట్‌గా ఉద్యోగం చేశారు. అప్పుడు అతని జీతం నెలకు 250 రూపాయిలు. 1976లో మురళి తన 25వ ఏట అమెరికా వెళ్ళి ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ టైంలో మురళి చేతిలో ఉన్న డబ్బు 500 వందల రూపాయిలు. తెలిసినవాళ్ళ సహాయ సహకారంతో మురళి అమెరికాకి వెళ్ళగలిగారు‌. అక్కడ ట్రినిటీ కెమికల్స్, ఫైక్ కెమికల్స్ వంటి సంస్థల్లో ఫార్మసిస్ట్‌గా జాబ్ చేశారు. అతి తక్కువ కాలంలోనే ఏటా 65 వేల డాలర్ల జీతం గడించే స్థాయికి చేరుకున్నారు‌. ఆ తర్వాత మురళి దివి పలు ఫార్మసిటికల్ కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూ సైంటిస్ట్‌గా ఎదిగారు. 1984 లో మురళి 40 వేల డాలర్లతో ఇండియాకు తిరిగి వచ్చారు‌. ఒక స్నేహితుడితో కలిసి కెమినార్ అనే సంస్థను స్థాపించారు. 1989లో కెమినార్ సంస్థను రెడ్డి ల్యాబ్స్ టేకోవర్ చేసింది. అక్కడి నుంచి మురళీ దివి రెడ్డి ల్యాబ్స్‌లో ఆరేళ్ళ పాటు పనిచేశారు. 1995 లో మురళీ రెడ్డి ల్యాబ్స్ నుంచి బయటికి వచ్చి సొంతంగా దివీస్ ల్యాబ్స్ అనే సంస్థను నెలకొల్పారు. హైదరాబాద్ చౌటుప్పల్‌లో మొదటి ఫ్యాక్టరీని 1995లో స్థాపించారు. ఆ తర్వాత ఏడేళ్ళకి అంటే.. 2002 లో దివీస్ ల్యాబ్స్ రెండో ఫ్యాక్టరీని విశాఖపట్నంలో స్థాపించారు.

ప్రపంచం ఫార్మసిటికల్ రంగానికి అవసరమైన క్రియాశీలక ఔషద పదార్ధాల ఉత్పాదన, సరఫరా చేసే ప్రముఖ సంస్థగా దివీస్ ల్యాబ్స్ ఎదిగింది. 2022లో దివీస్ ల్యాబ్స్ ఏకంగా 88 బిలియన్ల (8800 కోట్లు) వ్యాపారాన్ని చేసి చరిత్ర పుటల్లోకి ఎక్కింది‌. ఫోర్బ్స్ సంపన్నుల జాబితాలో మురళీ దివి కీ చోటు కల్పించింది‌‌. ప్రస్తుతం మురళీ దివి 53 వేల కోట్ల ఆస్తులతో హైదరాబాద్‌లోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular