Sunday, May 19, 2024

ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు

  • రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  • ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చేందుకు చొరవ చూపాలని
  • మంత్రికి విజ్ఞప్తి చేసిన గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన రైతులు

ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపట్టినట్టు రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఉదయం ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న గజ్వేల్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన దాదాపు 500 మంది రైతులు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు.

పీర్లాపల్లి, ఇటిక్యాల, లింగారెడ్డి పల్లి, ఆలీరాజ్ పేట్, నర్సన్నపేట, చేబర్తి, పాతూరు, మక్తా మాసాన్ పల్లి, సామలపల్లి, నెంటూర్, బంగ్ల వెంకటాపూర్, బేగంపేట్, ఎల్కంటి గ్రామాలకు చెందిన రైతులకు ఇటీవల ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణ భూసేకరణకు నోటీసులు వచ్చాయని, అయితే తాము ఇప్పటికే మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో భూనిర్వాసితులం అయ్యామని మళ్లీ తమకు మిగిలిన కొద్దిపాటి భూములు ఆర్‌ఆర్‌ర్‌లో పోతే తాము జీవనాధారం కోల్పోతామని వారు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తమ పరిస్థితిని మానవతా ధృక్పథంతో పరిశీలించి ఆర్‌ఆర్‌ఆర్ అలైన్‌మెంట్ మార్చేందుకు చొరవ చూపాలని వారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి విన్నవించారు.

రైతులతో సుధీర్ఘంగా మాట్లాడిన మంత్రి
రైతులతో సుధీర్ఘంగా మాట్లాడిన మంత్రి వారి సాధక,బాధలను తెలుసుకొని తాను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డితో చర్చించి తగిన నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు రైతులు ఆందోళన చెందవద్దని రైతులకు మంత్రి కోమటిరెడ్డి ధైర్యం చెప్పారు. గత ప్రభుత్వం అనాలోచితంగా నిర్మించిన ప్రాజెక్టు వల్ల ప్రజాధనం వృథా అవడమే కాకుండా రైతులు నిర్వాసితులుగా, బాధితులుగా మారారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వ తప్పిదాల వలన రాష్ట్ర భవిష్యత్‌ను మార్చే ఆర్‌ఆర్‌ఆర్ నిర్మాణానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని, గత ప్రభుత్వం మాదిరిగా ఒంటెద్దు పోకడలు పోకుండా ప్రజాస్వామ్యయుతంగా రైతుల సమస్యలను తీర్చుతూనే రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందన పట్ల రైతులు ఆనందం వ్యక్తం చేశారు. పదేండ్లుగా మా సమస్యలు చెప్పుకుందామంటే ఏ మంత్రి కలిసేవారు కాదనీ, కానీ, ఎలాంటి అపాయింట్ మెంట్ లేకుండా తమ సమస్యను ఎంతో ఓపిగ్గా విని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి కోమటిరెడ్డి చెప్పడం చాలా సంతోషం కలిగించిందని వారు మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular