టీఎస్, న్యూస్:అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీకైనా భయపడాల్సిందే. ఇప్పుడు రాష్ట్రంలో అదే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డలోని మూడు పిల్లర్లు కుంగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇక్కడ పునరుద్ధరణ పనులు చేసేందుకు సదరు బ్యారేజ్నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఇప్పటిదాకా వెనకడుగు వేసింది. ప్రాజెక్టు నిర్మాణం చేసే వరకే తమ బాధ్యత అని, ఇప్పుడు ఉచితంగా నిర్మించమని, డీపీఆర్ ఇస్తే.. దానికి అగ్రిమెంట్ చేస్తే మేడిగడ్డ దగ్గర కాఫర్ డ్యాం నిర్మాణం చేసి, పునరుద్ధరణ చేస్తామని గతంలోనే తేల్చి చెప్పింది. కానీ, కాంగ్రెస్ప్రభుత్వం దీనిపై సమయానుకూలంగా ఓపిక పట్టింది. అనుకున్న సమయం రాగానే.. అసలు బెదిరింపులకు దిగినట్లైంది. దీంతో ఇక్కడ కాఫర్డ్యాం కట్టేందుకు నిర్మాణ సంస్థ ముందుకువచ్చింది. మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ దగ్గర మూడు పిల్లర్లపై కాఫర్ డ్యామ్ను ఎల్అండ్టీ సంస్థ నిర్మించబోతున్నది. మరమ్మతులకు అయ్యే ఖర్చు అంతా తామే భరిస్తామని నిర్మాణ సంస్థ ముందుకువచ్చింది. ప్రస్తుతం వరదలు వచ్చేలోపు మేడిగడ్డ బ్యారేజీ 7వ బ్లాక్లోని 19, 20, 21 పిల్లర్ల దగ్గర కాఫర్ డ్యామ్ను సైతం సైతం ఎల్అండ్టీ సంస్థ నిర్మించనున్నట్లు తెలుస్తున్నది.
ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిన విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్లో మూడు పిల్లర్లు కుంగిపోయాయి. అయితే, మేడిగడ్డ పిల్లర్ల కుంగుబాటుపై ఇప్పటికే విచారణ జరుగుతున్నది. కేంద్ర డ్యాం సేఫ్టీ నిపుణుల బృందం కూడా పరిశీలించింది. ఈ విచారణ జరుగుతుండగా.. మేడిగడ్డ వద్ద పంపింగ్ను నిలిపివేయడంతో ఎండకాలంలో నీటి కొరత తీవ్రమైంది. పంటలు ఎండిపోవడంతో పాటు మంచినీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
అయితే, ఇంతకు ముందు మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ, కాఫర్ డ్యామ్ నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలని అంతకు ముందు ఎల్అండ్టీ సంస్థ పేర్కొంది. ప్రభుత్వం ఇచ్చిన డిజైన్తోనే బ్యారేజీని నిర్మించామని.. అందులో లోపాలకు తాము బాధ్యులం కామన్న సంస్థ చెప్పింది. అయితే, మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులు చేపట్టాల్సిందే నిర్మాణ సంస్థనేనని ప్రభుత్వం నుంచి కొంతమేరకు బెదిరింపులు వచ్చినట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలొనే ఎల్అండ్టీ సంస్థ దిగివచ్చి పునరుద్ధరణ పనులు చేపడుతామని ముందుకువచ్చినట్లు తెలుస్తున్నది.